ఫోర్జరీ కేసు : ఏపీ జనసేన జెడ్పిటిసిపై తెలంగాణలో క్రిమినల్ కేసులు...
తెలంగాణలో రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లను అక్రమంగా దక్కించుకున్న వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పిటిసి, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు బృందంపై ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి.
ఏలూరు : ఫోర్జరీ పత్రాలతో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సమర్పించి రొయ్యలు, చేప పిల్లల సరఫరా టెండర్లు దక్కించుకున్న వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పిటిసి, జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు బృందంపై తెలంగాణ ప్రభుత్వ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలకు సిద్ధం అవుతున్నారు.
తెలంగాణలోని 32జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు, రొయ్యలను వదిలేందుకు ఆ రాష్ట్ర మత్స్యశాఖ సుమారు రూ.113 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. భీమవరానికి చెందిన జనసేన నాయకుడు గుండా జయప్రకాష్ నాయుడు పలువురి పేర్లతో తెలంగాణాలో 9 నుంచి 12 జిల్లాల్లో టెండర్లు దాఖలు చేసి దక్కించుకున్నాడు. అయితే, బ్యాంకు గ్యారెంటీ, పర్ఫామెన్స్ గ్యారెంటీల విషయంలో మోసానికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. బ్యాంకు గ్యారెంటీ నకిలీవని, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.