ఆంధ్రాలో కత్తుల కౌగిలి
- కత్తులు నూరుకున్న నేతలు కౌగిలించుకున్నారు
- వారిని ఇలా చూసిన వారు షాక్ అవుతున్నారు
ఒకప్పుడు వారిద్దరూ ప్రత్యర్థి పార్టీల నేతలు. పొద్దున లేస్తే రాత్రి పడుకునే వరకు వారిద్దరూ సమయం సందర్భం ఉన్నా లేకపోయినా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నవారే. వారి వైరి బంధం ఈనాటికిది కాదు. దశాబ్దాల కాలంగా వారు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకున్నారు.
కానీ అందులో ఒకాయన రాజ్యాంగబద్ధమైన పోస్టులోకి చేరిపోయారు. ఇంకోగాయన అట్నే పాత పద్ధతిలోనే కొనసాగుతున్నారు. అనూహ్యంగా వారిద్దరి మధ్య వైరం సమసిపోయి స్నేహం చిగురించింది. ఇద్దరూ కలుసుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.
ఇప్పటికే అర్థమైపోయింది కదా? ఎవరో ఆ ఇద్దరు. వారే ఒకరు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మరొకరు సిపిఐ నేత కె.నారాయణ. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ఎన్నికైన తర్వాత నారాయణ సతీమణి వసుమతితో కలిసి వెంకయ్యకు బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
నిన్నమొన్నటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుని నేడు అవే కత్తులు కౌగలించుకుంటున్నాయని సరదాగా విమర్శించేవారు కూడా ఉన్నారు.