Coronavirus: తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
Telangana: తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై కరోనా మార్గదర్శకాలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది.
Telangana Covid-19 updates: దేశంలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. పలు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా మహమ్మారి బారినపడుతున్న వారి సంఖ్య అధికం అవుతోంది. కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న జాబితాలో తెలంగాణ కూడా ఉంది. రాష్ట్రలో కొత్తగా 494 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా వైరస్ కేసులు 7,97,632కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వెలుగుచూశాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 315 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 126 మంది ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,90,473గా ఉందని ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. ప్రస్తుత కరోనా వైరస్ రికవరీ రేటు 99.10 శాతంగా ఉంది.
తెలంగాణలో కొత్తగా కరోనా వైరస్ కారణంగా ఎలాంటి మరణాలు చోటుచేసుకోకపోవడం ఊరట కలిగించే అంశం. అయితే, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 4,111 మంది కరోనాతో మరణించారు. ఈ రోజు 28,865 నమూనాలను పరీక్షించినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ తన కరోనా బులెటిన్లో పేర్కొంది. ప్రస్తుతం కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 3,048గా ఉందని తెలిపింది. రాష్ట్రంలో గత పక్షం రోజులుగా రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమై కరోనా మార్గదర్శకాలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది. మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపింది.
ఇదిలావుండగా, దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ బులిటెన్ వెల్లడించింది. భారతదేశంలో కరోనావైరస్ సంక్రమణ కేసుల పెరుగుదలతో గత 24 గంటల్లో దేశంలో గురువారం 13,313 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటి 12,249 కేసులతో పోలిస్తే కరోనా కేసులు పెరిగాయి. ఇదే సమయంలో కొత్తగా 10,972 మంది ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 98.6 శాతంతో 4,27,36,027కి చేరుకుంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 83,990గా ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా ఉంది. అయితే వారపు పాజిటివిటీ రేటు 2.81 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా కొత్తగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,24,941 కు చేరుకుంది. దేశంలో ఇప్పటివరకు 85.94 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. 24 గంటల్లో 6,56,410 పరీక్షలు జరిపినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 196.62 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసులు 91.7 కోట్లు ఉన్నాయి. రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 84 కోట్లకు పెరిగింది.