Coronavirus: తెలంగాణలో కొత్తగా 652 కరోనా కేసులు
COVID-19: తెలంగాణలో కొత్తగా 652 మంది కరోనావైరస్ బారినపడ్డారు. అయితే, గత ఐదు రోజులతో పోలిస్తే రాష్ట్రంలో కోవిడ్-19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
Telangana COVID-19 cases: దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ రోజురోజుకూ కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతూ కలవరం రేపుతున్నాయి. అయితే, గత ఐదు రోజులతో పోలిస్తే.. తెలంగాణలో తాజాగా రోజువారి కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో కొత్తగా 652 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో శనివారం కోవిడ్-19 కేసులు బాగా తగ్గాయి. గత నాలుగు రోజుల్లో రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 990 నుండి 1,000 కంటే అధికంగా నమోదయ్యాయి. అయితే శనివారం 652 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆగస్టు 2 నుండి 5 వరకు రోజువారీ పరీక్షలు దాదాపు 40,000 నుండి 44,000 వరకు నిర్వహించారు. శనివారం 40,451 నమూనాలను పరీక్షించారు. ఇంకా 769 ఫలితాలు రావాల్సి ఉంది. కొత్తగా నమోదైన 652 కేసుల్లో హైదరాబాద్లో 220, రంగారెడ్డిలో 46, మేడ్చల్ మల్కాజిగిరిలో 41 కేసులు నమోదయ్యాయి. మార్చి 2, 2020 నుండి ఈ సంవత్సరం ఆగస్టు 6 వరకు, మొత్తం 3.67 కోట్ల నమూనాలను పరీక్షించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 8,25,360 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 6,219 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8,15,030 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అలాగే, కరోనా వైరస్ తో పోరాడుతూ 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలావుండగా, దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ.. హెచ్చరించింది. కోవిడ్ -19 కేసుల పెరుగుదలపై కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. కఠినమైన నిఘా ఉంచాలని కోరింది. వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం గత 24 గంటల్లో 19,406 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ కేసులు మళ్లీ కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ప్రజలు బూస్టర్ డోసుల కోసం పరుగులు పెడుతున్నారు.
గత వారం రోజులుగా దేశ రాజధానిలో నమోదైన కరోనావైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ, గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కోవిడ్ ముందుజాగ్రత్త మోతాదును చాలా తక్కువ మంది ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారుతున్నట్టు తెలుస్తోంది. నగర ఆరోగ్య శాఖ అధికారిక సమాచారం ప్రకారం ఆగస్టు 2 నాటికి, నగరంలో మొత్తం బూస్టర్ మోతాదుల సంఖ్య 22,19,059గా ఉంది. ఇదిలావుండగా, శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసిన 24 గంటల్లో గుజరాత్లో 965 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 12.6 లక్షలకు చేరుకుంది. రాష్ట్ర కోవిడ్ మరణాల సంఖ్య 10,975గా ఉంది.