Telangana Assembly election: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పాలసీ, లెక్కింపు, కమ్యూనికేషన్, ఎగ్జిక్యూషన్ (పీసీసీఈ) సహా పలు అంచెల విధానంతో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు.
Telangana Congress president Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్రణాళికలతో కాంగ్రెస్ ముందుకు సాగుతున్నదని తెలుస్తోంది. అధికార పార్టీకి చెక్ పెట్టాలనుకుంటున్న కాంగ్రెస్.. అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. అయితే, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేస్తున్నారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పాలసీ, లెక్కింపు, కమ్యూనికేషన్, ఎగ్జిక్యూషన్ (పీసీసీఈ) సహా పలు అంచెల విధానంతో ముందుకెళ్తున్నామని ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఈ ఏడాది చివరలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు, అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి 75 అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 25 స్థానాలకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. పార్టీ గెలుపు కోసం పాలసీ, లెక్కింపు, గణన, కమ్యూనికేషన్, ఎగ్జిక్యూషన్ (పీసీసీఈ) అనే నాలుగు అంచెల విధానంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో తమ పార్టీతో పోటీ పడే రాజకీయ పార్టీ ఏదీ లేదని పునరుద్ఘాటించిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా 80 లక్షల ఓట్లు అవసరమని అంచనా వేశామన్నారు. 75 నుంచి 80 లక్షల ఓట్లు సాధిస్తే పార్టీ గెలుస్తుంది. ఇప్పటి వరకు 43 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రాష్ట్రంలోని 36,594 పోలింగ్ కేంద్రాల్లో 42 వేల మందిని బూత్ ఎన్రోలర్లుగా నియమించామని తెలిపారు.
బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు..
బీఆర్ఎస్, బీజేపీలు పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను అమలు చేయడం ఏ రాజకీయ పార్టీకైనా ప్రధాన కర్తవ్యం, కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యులను ప్రలోభపెట్టడం బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల ప్రధాన బాధ్యతగా తీసుకున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీల డీఎన్ఏలు ఒకటేనని ఆరోపించారు. ఎన్నికల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు, ఫిరాయింపులను ప్రోత్సహించడంలో రెండు పార్టీలు ఒకే వైఖరితో ముందుకు సాగుతున్నాయని ఫైర్ అయ్యారు. గతంలో బీజేపీనే తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావించిన బీఆర్ఎస్ నేతలు ఏనాడూ కాంగ్రెస్ గురించి మాట్లాడలేదని, కానీ ఇప్పుడు హాత్ సే హాత్ జోడో యాత్రతో పరిస్థితి మారిపోయిందన్నారు. తాము ఎక్కడికి వెళ్లినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మమ్మల్ని ఫాలో అవుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
