వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందడమే కాక, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని నిరసిస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు.. ఆ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించారు. పలువురు ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. 

ఇక, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వైపు వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే నాయిని రాజేందర్‌ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ అరెస్ట్‌లతో ఆందోళనను అడ్డుకోలేరని అన్నారు. 

ఇక, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వారు అటు వైపుకు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎంజీఎం సెంటర్లోనే పలువురు కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డును మూసివేశారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.