పార్లమెంటులో ఈ రోజు టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లు పదునైనా వ్యాఖ్యలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి హిందీలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందు ఆయన భాషపై సీతారామన్ కామెంట్ చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తపరిచారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో ఈ రోజు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య వాడిగా, వేడిగా వాదం జరిగింది. కొశ్చన్ అవర్లో ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్న వేశారు. రూపాయి విలువ పతనం, బలోపేతం గురించి ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. రేవంత్ రెడ్డి హిందీ భాష గురించి కామెంట్ చేశారు. బలహీనమైన హిందీ భాషలో ప్రశ్న వేసిన రేవంత్ రెడ్డికి.. అదే బలహీనమైన భాషలోనే సమాధానం చెబుతా అంటూ కామెంట్ చేశారు. దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సభను గంభీరంగా మార్చేశాయి. తాను శూద్రుడిని కాబట్టి.. స్వచ్ఛమైన హిందీ తనకు రాదని, కానీ, వారు బ్రాహ్మణవాదులు కాబట్టి.. శుద్ధమైన హిందీ వచ్చు అని వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి తన ప్రశ్నలో నరేంద్ర మోడీని ప్రస్తావించారు. గుజరాత్ సీఎంగా ప్రస్తుత మోడీ ఉన్న కాలంలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి విలువ గురించి ప్రశ్నించారని, ఇప్పుడు తాను అదే ప్రశ్న వేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అప్పుడు డాలర్కు రూపాయి విలువ 60 నుంచి 70 మధ్యలో ఉందని, అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఐసీయూలోకి తీసుకెళ్లిందని నరేంద్ర మోడీ అడిగారని ఉటంకిస్తూ.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా మార్చురీకే తీసుకెళ్లుతున్నదా? అని ప్రశ్నించారు. రూపాయిని మళ్లీ బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్లాన్ ఏది అని అడిగారు.
Also Read: హిందీ భాషను మాపై రుద్దవద్దని నిరసిస్తూ 85 ఏళ్ల రైతు ఆత్మహత్య.. డీఎంకే ఆఫీసు ఎదుటే ఒంటికి నిప్పు
ఇందుకు సమాధానం ఇవ్వాలని స్పీకర్ ఓం బిర్లా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అనుమతి ఇచ్చారు. తాను కూడా అదే తెలంగాణ నుంచి వచ్చానని, కానీ, రేవంత్ రెడ్డి బలహీనమైన హిందీ భాషలో తనకు ప్రశ్న వేశారని ఆమె అన్నారు. కానీ, తన హిందీ కూడా బలహీనమైన భాషే అని తెలిపారు. అయితే ఆ బలహీనమైన హిందీ ప్రశ్నకు తాను బలహీనమైన హిందీ భాషలోనే సమాధానం చెబుతానని వివరించారు.
ఆ తర్వాత అప్పటి ఆర్థిక వ్యవస్థ, ఇప్పటి ఆర్థిక వ్యవస్థ కాలాలు, పరిస్థితులు వేరు అని తేడాలు చెప్పారు. కేవలం రూపాయి మారకం విలువనే కాదు.. ఇతర సూచీలను ప్రస్తావిస్తే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. అప్పటి ఆర్థిక వ్యవస్థ ఐసీయూలోనే ఉందని, తామే దాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని వివరించారు. అనంతరం, కరోనా మహమ్మారి వంటి కఠిన సవాళ్లను ఎదుర్కొని వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం,రేవంత్ రెడ్డి నిలబడి నిర్మలా సీతారామన్ తన భాషపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన భాషపై అలా మాట్లాడటం సరి కాదని అన్నారు. తాను శూద్రుడినని అందుకే తనకు శుద్ధ మైన హిందీ భాష రాదని తెలిపారు. కానీ, నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ వాది కాబట్టి, శుద్ధమైన హిందీ భాష వస్తుందేమో అని పేర్కొన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఆ తర్వాత చట్ట సభ్యులకు ఓ హెచ్చరిక చేశారు.
Also Read: దేశంలోని అన్ని భాషల్లో హిందీ కూడా ఒకటి మాత్రమే.. బలవంతంగా రుద్దొద్దు.. కేటీఆర్ ట్వీట్..
జాతి, ధర్మం, కులం, ప్రాంతం ఆధారంగా ఎన్నికై ఇక్కడకు రాలేదని, ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడకు వచ్చారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కాబట్టి, ఇక్కడ జాతి, మతం, ప్రాంతం వంటి ఆధారంగా కామెంట్లు చేయ రాదని సూచించారు. కాబట్టి అలా చేస్తే వారిపై దర్యాప్తునకు కూడా ఆదేశించగలను అని హెచ్చరించారు. ఇది ఆన్ రికార్డులో ఇస్తున్న హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లోనూ చర్చనీయాంశంగా మారాయి.