Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్‌దంటూ ఆరోపణ: జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఫామ్ హౌస్ వద్దకు వెళ్తున్న  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

Congress MP Revanth Reddy arrested at Janwada in Rangar Reddy district
Author
Hyderabad, First Published Mar 2, 2020, 5:16 PM IST


హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ వద్ద  25 ఎకరాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బినామీ పేర్లతో ఈ ఫామ్ హౌస్ ను ఏర్పాటు చేసుకొన్నారన్నారు.  ఫామ్ హౌస్ ను పరిశీలించేందుకు వెళ్తున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

జన్వాడ గ్రామంలో 111 జీవో పరిధిలోకి వచ్చే భూముల్లో  భవనం మంత్రి కేటీఆర్‌కు సంబంధించిందిగా  రేవంత్ రెడ్డి ఆరోపించారు.  కేటీఆర్ బినామీ ఫాం హౌస్ అంటూ రేవంత్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను  రేవంత్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు. 

జన్వాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 301, 302, 312, 313 లలో తన స్నేహితులైన రాజులు, వారి కుటుంబ సభ్యుల పేరుతో కేటీఆర్ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో, మూడంతస్థుల రాజమహల్ కట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 25 ఎకరాలలో అక్రమంగా ఈ భవనాన్ని నిర్మించారని చెప్పారు.

 ఈ మహల్ సమీపంలో చిన్న సముద్రం చెరువు నుంచి ఫిరంగి కాల్వ వెళ్లి గండికోటలో కలుస్తుంది. ఈ పిరంగి కాల్వను పూర్తిగా పూడ్చేసి దానిపై కేటీఆర్ ఈ మహల్ నిర్మించారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ భూమి సమీపంలో భూములు ఉన్న మహిపాల్ రెడ్డి, మరికొందరిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి బెదిరించి మరీ ఆ భూములు గుంజుకున్నారని రేవంత్ ఆరోపించారు.

 సుప్రీంకోర్టు ఆదేశాలు, గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాల మేరకు అమలులో ఉన్న 111 జీవో ప్రకారం నీటి సంరక్షణ ప్రాంతాలైన హిమాయత్ సాగర్, గండిపేటల చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇక్కడ అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా కేటీఆర్ రాజమహల్ జోలికి అధికారులు ఎందుకు వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యువరాజు కట్టుకున్న ఈ ఇంద్రభవనంలో ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నారో చెప్పాలన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకుని ప్రెస్ మీట్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి  పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాము ప్రైవేటు భూమిలో నిలబడి ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. 

కేటీఆర్ ఫాం హౌస్ కు పోలీసులు కాపలాకాస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంతలా వారిస్తున్నా పోలీసులు వాళ్లను ఈడ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో రేవంత్ రెడ్డి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ, మాజీ ఎంపీలతో ఇలాగేనా వ్యవహరించేది అని మండిపడ్డారు. 

ఎవరు ఫిర్యాదు ఇస్తే ఇక్కడికి వచ్చారో చెప్పాలని పోలీసులను నిలదీశారు. భద్రతా సమస్య ఉందని పోలీసులు చెప్పడంతో... ఎవరికి భద్రత, ఫాంహౌస్ లో ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. తాము ఓ ప్రైవేటు స్థలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని ఒక అంశాన్ని మీడియాకు వివరించే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకునే అధికారం పోలీసులకు ఎక్కడిదని రేవంత్ ప్రశ్నించారు.

 తెలంగాణ ఉద్యమంలో పోలీసులు కూడా క్రియాశీలకంగా వ్యవహరించారని మీరు కూడా తెలంగాణలో భాగస్వాములేనని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాగ్వాదం, తోపులాట సందర్భంలో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కాలికి గాయం అయింది. చివరికి పోలీసులు బలవంతంగా రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డితో పాటు ఇతర స్థానిక నేతలను అరెస్టు చేసి అక్కడ నుంచి తరలించారు.

Also read:రేవంత్ బ్రదర్స్‌‌కు బిగుస్తున్న ఉచ్చు: బాధితుల ఫిర్యాదులు, ప్రభుత్వం సీరియస్

రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. సోలీసులతో కూడ రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది. 

Also Read:రేవంత్ కు గోపనపల్లి భూముల ఉచ్చు: వెనుక కథ ఇదీ

హైద్రాబాద్ గోపన్‌పల్లి వద్ద రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డిలు అక్రమంగా భూమిని ఆక్రమించారని  కూడ ఇటీవల ఫిర్యాదులు అందాయి.ఈ కేసులో రెవిన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ కేసులో రెవిన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. రాజేంద్రనగర్ ఆర్ డీ ఓ చంద్రకళ విచారణ చేస్తున్నారు.

పట్టణ గోస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందునే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios