2019లో నల్గొండ నుండే తెలంగాణకు సీఎం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లొండ జిల్లాకు చెందిన వ్యక్తే 2019 లో తెలంగాణకు సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు.
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లొండ జిల్లాకు చెందిన వ్యక్తే 2019 లో తెలంగాణకు సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు.
సోమవారం నాడు భువనగిరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ ఇచ్చిన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే మన మధ్య ఉన్న చిన్న చిన్న పొరపొచ్చాలను కూడ విస్మరించి పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. కానీ, టీఆర్ఎస్లో మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే సీఎం పదవి దక్కుతోందన్నారు.
అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా నల్గొండ నుండి ఎమ్మెల్సీగా తనను గెలిపించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలంతా నల్గొండ జిల్లా నాయకత్వం వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకొనేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.