రైతులను అవమానపర్చాడు: మంత్రి నిరంజన్ రెడ్డిపై భట్టి ఫైర్
రైతులను అవమానపర్చేవిధంగా మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
హైదరాబాద్:రైతులను అవమానపర్చే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. అవమానపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టీ పట్టనున్నట్టు వ్యవహరిస్తోందన్నారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడితే సినిమా టిక్కెట్ల కోసం క్యూ కట్టిన వారితో మంత్రి నిరంజన్ రెడ్డి పోల్చడం రైతులను అవమానపర్చడమేనని ఆయన అన్నారు.
పెట్టుబడి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. రైతు బందు పథకం కింద నిదులు ఇంకా చెల్లించలేదన్నారు. రైతు రుణ మాఫీని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
పంటల భీమాకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.
మరో వైపు తన మంత్రి పదవి పోతోందనే భయంతో మాట్లాడిన ఈటల రాజేందర్ రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడుతోంటే ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధైర్యంగా మాట్లాడారని ఆయన ప్రశంసించారు. ఆంద్రాకు బదులుగా తెలంగాణ ఒక్కటి మాత్రమే మారిందని ఆయన చెప్పారు.ఈటల రాజేందర్ గొప్ప ఉద్యమ నాయకుడిగా తాను ఎక్కడో చదివానని ఆయన ప్రస్తావించారు.