సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ రూ.35 వేల విలువైన షర్ట్తో అసెంబ్లీకి హాజరయ్యారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు షాకయ్యారు. దీనిపై వాళ్లంతా చర్చించుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధరించిన చొక్కాపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. జగ్గారెడ్డి మంగళవారం కెన్జో షర్ట్ ధరించి సమావేశాలకు హాజరయ్యారు. ఎప్పుడు ఖద్దర్ షర్ట్ లేదంటే టీ షర్ట్తోనే ఆయన సభకు వస్తుంటారు. అయితే ఈరోజు జగ్గారెడ్డి క్యాజువల్ డ్రస్స్లో రావడంతో అధికార, విపక్ష ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఆసక్తికరంగ చర్చించుకున్నారు. ఈ క్రమంలో మీ షర్ట్ ధర ఎంత సార్ అంటూ.. కొందరు విలేకరులు ప్రశ్నించగా రూ.35 వేలంటూ సమాధానమిచ్చారు.
దీంతో అంతా షాక్ అయ్యారు. డౌట్ ఉంటే గూగుల్లో చెక్ చేసుకోవాలంటూ జగ్గారెడ్డి సూచించారు. అంతేకాకుండా తాను కాస్ట్లీ డ్రస్లు వేసుకోకూడదా.. జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వేసుకోవాలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో జగ్గారెడ్డి అసలు విషయం చెప్పారు. సమయానికి తన వద్ద చొక్కాలు అందుబాటులో లేకపోవడంతో తన కొడుకు షర్ట్ వేసుకుని అసెంబ్లీకి వచ్చినట్లు తెలిపాడు. రాహుల్ గాంధీ ధరించిన షర్ట్ మీద కూడా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని.. ఆయనకు రూ.40 వేల టీ షర్ట్ వేసుకునే స్థోమత లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఇదిలావుండగా.. దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే, రాహుల్ ధరించిన ఓ టీ షర్ట్ ఇప్పుడు వివాదాస్పదమయ్యింది. రాహుల్ ‘బర్ బెర్రీ’ టీ షర్ట్ ధరించారని, దాని విలువ ఏకంగా రూ.41వేలు అంటూ…బీజేపీ ట్విట్టర్లో పోస్టు చేసింది. రాహుల్ ఆ టీ షర్ట్ తో ఉన్న ఫోటోతో పాటు, పక్కనే ఆన్లైన్ లో దాన్ని ధరను తెలుపుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ… ‘భారత్, దేఖో’! అంటూ పోస్ట్ చేసింది.
కాగా, ఈ పోస్టుపై కాంగ్రెస్ సైతం ధీటుగానే సమాధానమిచ్చింది. ప్రధాని మోడీ ధరించిన సూట్ ధరను గుర్తు చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ను చూసి భయపడి పోతున్నారా? నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇలాంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. అదే దుస్తుల గురించి మాట్లాడాల్సి వస్తే… మోడీజీ రూ.10 లక్షల సూట్, రూ.1.5ల లక్షల కళ్ళజోడు గురించి మాట్లాడాల్సి వస్తుంది.. అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
