Asianet News TeluguAsianet News Telugu

‘భారత్, దేఖో’.. రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్ ఎంతో తెలుసా?.. వివాదం రేపిన బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్...

భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధరించిన టీ షర్ట్ మీద వివాదం చెలరేగింది. దీనికి కాంగ్రెస్ ధీటుగా సమాధానం ఇచ్చింది. 

Controversy over Rahul Gandhi's T-shirt, Congress counter to BJP
Author
First Published Sep 10, 2022, 6:39 AM IST

ఢిల్లీ  : దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే, రాహుల్ ధరించిన ఓ టీ షర్ట్ ఇప్పుడు వివాదాస్పదమయ్యింది. రాహుల్ ‘బర్ బెర్రీ’ టీ షర్ట్ ధరించారని, దాని విలువ ఏకంగా రూ.41వేలు అంటూ…బీజేపీ ట్విట్టర్లో పోస్టు చేసింది.  రాహుల్ ఆ టీ షర్ట్ తో ఉన్న ఫోటోతో పాటు, పక్కనే ఆన్లైన్ లో దాన్ని ధరను తెలుపుతూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ… ‘భారత్, దేఖో’!  అంటూ పోస్ట్ చేసింది.

కాగా, ఈ పోస్టుపై కాంగ్రెస్ సైతం ధీటుగానే సమాధానమిచ్చింది.  ప్రధాని మోడీ ధరించిన సూట్ ధరను గుర్తు చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ను చూసి భయపడి పోతున్నారా? నిరుద్యోగం, ద్రవ్యోల్బణం  ఇలాంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. అదే దుస్తుల గురించి మాట్లాడాల్సి వస్తే… మోడీజీ రూ.10 లక్షల సూట్, రూ.1.5ల లక్షల కళ్ళజోడు గురించి మాట్లాడాల్సి వస్తుంది.. అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు.. ప్రజలతో మమేకమవ్వాలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమం ‘భారత్ జోడో యాత్ర’. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బుధవారం సాయంత్రం కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలుఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతాడా? అని ప్రశ్నించగా… ఎన్నికలు జరిగిన తరువాత తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతానో, లేదో తేలిపోతుందని.. అప్పటి వరకు ఆగాలని రాహుల్ గాంధీ అన్నారు.

అధ్య‌క్షుడిని అవుతానో? లేదో? అప్పుడే తేలుతుంది: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వాలని అభ్యర్థనపై తాను నిర్ణయం తీసుకున్నాననీ, ఆ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని తెలిపారు. పార్టీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అప్పుడు సమాధానం చెబుతానని అన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకపోతే.. ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించండని,  అప్పుడు సమాధానం చెబుతానని అన్నారు. పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అవకాశం లభించిందనీ, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేసిన నష్టాన్ని తెలుసుకుంటున్నాం అని అన్నారు. తాను చేస్తున్న యాత్రపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని, తాను ప్రజలతో మమేకం కావడానికి యాత్ర చేస్తున్నానని రాహుల్గాంధీ తెలిపారు.

ప్రస్తుతం అన్ని సంస్థలు బిజెపి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని.. ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు వాటిని వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘భారత్ జోడో యాత్ర’ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా…  తన దగ్గర ఎలాంటి సందేశం లేదని సమాధానమిచ్చారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ సహా 119 మంది నేతలను ‘భారత్ యాత్రికులు’గా కాంగ్రెస్ పేర్కొంది.  ఈ యాత్ర 3,570 కిలోమీటర్లు సాగనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios