కరోనా విషయంతో తప్పుడు లెక్కలు చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేసు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: 2020 మార్చి నుండి ఇప్పటివరకు కరోనా వేవ్ వన్, వేవ్ టు లో ప్రజలు పిట్టల్లా రాలిపోయారని... అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ మరణాలపై తప్పుడు లెక్కలు చెబుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్రమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా మరణాలను దాస్తోందని... కేసీఆర్ సర్కార్ ఇచ్చిన దొంగ లెక్కలనే కేంద్రం పార్లమెంట్ లో తక్కువగా చూపడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాలపై అడిట్ జరగాలన్నారు.
''రాష్ట్రంలో కేవలం 3710 మంది మాత్రమే చనిపోయినట్లు కేసీఆర్ సర్కార్ తప్పుడు లెక్కలు చూపడం దారుణం. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్ ఘడ్ , కేరళ, ఒరిస్సా, పంజాబ్, జమ్మూకాశ్మిర్, ఢిల్లీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో చనిపోయారని అక్కడి ప్రభుత్వాలు లెక్కలు చూపాయి. అబద్దాల కోరు కేసీఆర్ మాత్రం తప్పుడు లెక్కలతో మభ్యపెడుతున్నాడు. కాబట్టి కేసీఆర్ పై కూడా ఢిల్లీ తరహాలో కేసు పెట్టాలి. ఢిల్లీ హై కోర్టు మంచి తీర్పు ఇచ్చింది'' అన్నారు.
read more కోర్టు ఆదేశాలు: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ త్రీటౌన్లో కేసు
''గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డెత్ కేసులు ఎక్కువగా వున్నాయ్. కానీ తక్కువగా చూపిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షా 80వేల మంది కోవిడ్ కారణంగా చనిపోయారు. కోవిడ్ మరణాలపై ఆధారాలతో చర్చించడానికి మేము సిద్ధం... కేటీఆర్ మీ తరుపున ఎవరు వస్తారో చెప్పండి'' అని సవాల్ విసిరారు.
''కోవిడ్ వల్ల పేరెంట్స్ చనిపోయి చాలా మంది పిల్లలు అనాధలయ్యారు. కోవిడ్ మరణాలపై సీఎస్ కు లేఖ రాస్తున్నాం. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై న్యాయపరమైన పోరాటం చేస్తాం'' అని శ్రవణ్ వెల్లడించారు.
