సూర్యాపేట కలెక్టరేట్ లో 200 కోట్ల స్కాం
- సూర్యాపేట కలెక్టరేట్ కుంభకోణంపై సిఎంను కలిసేందుకు పోతే అరెస్టు చేస్తరా?
- ప్రభుత్వ స్థలం ఉండగా ప్రయివేటు భూముల్లో కలెక్టరేట్ కట్టుడేండి?
- మంత్రి జగదీశ్వర్ రెడ్డి కనుసన్నల్లో ఈ కుంభకోణం
సూర్యాపేటలో ప్రజలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో కాకుండా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ప్రైవేట్ భూముల్లో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారని, ఇందులో దాదాపు 200 కోట్ల రూపాయలు అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ప్రభుత్వ భవనాలు ప్రైవేట్ స్థలంలో నిర్మిస్తున్నారని టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, నల్గొండ డిసిసి అధ్యక్షులు బిక్షమయ్య గౌడ్లు విమర్శించారు. ఈ విషయమై వారు గురువారం ఒక సంయుక్త ప్రకటన చేస్తూ గురువారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ సూర్యాపేటలో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని అయితే ఈ విషయంలో సి.ఎంతో కలిసి సమస్యలు వివరించేందుకు అకిలపక్షం నాయకులు ప్రయత్నిస్తే దామోదర్ రెడ్డితో సహా అనేక మంది నాయకులను గృహ నిర్బంధం చేశారని ఇంత అప్రజాస్వామికంగా, అక్రమంగా పాలించడం ఏమిటని వారు ప్రశ్నించారు.
పట్టణానికి సమీపంలో ప్రభుత్వ భూములుండగా, మంత్రి జగదీశ్వర్ రెడ్డి భూములు ఉన్న పట్టణానికి దూరంగా, ప్రజలకు అందుబాటులో లేని స్థలంలో కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఇందులో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుట్ర ఉందని దాదాపు 200 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. పట్టణానికి సమీపంలో నల్లచెరువు వద్ద, గాంధీనగర్ వద్ద, దురాజ్పల్లి వద్ద ప్రభుత్వ భూములున్నా కూడా జగదీశ్వర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో లేని తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడే భూములలో ఈ భవనాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని దీని వల్ల ప్రజలకు చాల నష్టం జరుగుతుందని ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తెస్తే మంత్రి జగదీశ్వర్ రెడ్డి గుట్టు బయటపడుతుందని భావించే పోలీసుల చేత కాంగ్రెస్తో సహా అన్ని పార్టీల నాయకులను (టిఆర్ ఎస్ మినహా) గృహ నిర్బంధం చేయించారని వారు ఆరోపించారు.
అంతేకాకుండా ముఖ్యమంత్రి సూర్యాపేట పరిధిలో ఈ రోజు చేసిన అభివృద్ది పథకాలు గతంలో కాంగ్రెస్ హయాంలో చేపట్టి పూర్తి చేయడం జరిగిందని పాత పథకాలనే కొత్తగా చేయిస్తున్నారని వారు విమర్శించారు. చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహార్ గ్రామంలో ఇంతకుముందే 440 కె.వి సబ్ స్టేషన్ కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలోనే పనులు చేసి ప్రారంభోత్సవం కూడా చేశామని, ఇక చివ్వెంల మండలంలో తాగునీటి అవసరాల కోసం గతంలోనే పథకం అమలు చేసి ప్రారంభించడం జరిగిందని ఆ పథకాన్ని ఇప్పడు మిషన్ భగీరథ పేరుతో మళ్ళీ ప్రారంభించి ప్రజలను మోసం చేశారని వారు ఆరోపించారు. నిర్బంధాలతో, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం, పాత పథకాలను ప్రారంభించడం లాంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడుతున్నారని, ప్రజల తగిన సమయంలో తగిన విధంగా బుద్ది చెబుతారని వారు అన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి