కేసీఆర్ కు దొరకని మోడీ అపాయింట్ మెంట్
ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవకుండానే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెనక్కి వచ్చేశారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలవకుండానే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెనక్కి వచ్చేశారు. వారి అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో ఆయన సోమవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ వచ్చేశారు.
స్థానికులకు ఉద్యోగాలు ఖాయం చేస్తూ తాము తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించాలని ప్రధానిని, రాష్ట్రపతిని ఆయన కోరాల్సి ఉండింది. రాష్ట మంత్రి వర్గం కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదించిన వెంటనే కేసిఆర్ ఆదివారంనాడు కోవింద్ ను, మోడీని కలవడానికి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.
సోమవారంనాడు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. జోనల్ వ్యవస్థపై వినతిపత్రం సమర్పించి ఆయన తిరిగి వచ్చారు. మోడీ మంగళవారంనాడు విదేశీ పర్యటనకు వెళ్తుండడం వల్ల బిజీగా ఉన్నారు. అలాగే, కోవింద్ సూరత్ వెళ్తున్నారు. దాంతో వారిద్దరి అపాయింట్ మెంటు కూడా కేసిఆర్ కు లభించలేదు.
రెండు మూడు రోజుల పాటు ఢిల్లీ ఉండి ప్రధానిని, రాష్ట్రపతిని కలవాలని కేసిఆర్ అనుకున్నారు. అది సాధ్యం కాకపోవడంతో తిరిగి వచ్చారు. జూన్ మొదటివారంలో మరోసారి ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.