Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించిన నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం...

చర్చనీయాంశంగా మారిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఫాం హౌజ్ లో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. 

CM KCR meeting with four MLAs who tried to trap, telangana
Author
First Published Oct 27, 2022, 2:05 PM IST

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నిన్న జరిగిన ఎపిసోడ్ మీద మరోసారి కేసీఆర్ కు ఎమ్మెల్యేలు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నివేదిక ఆధారంగా బీజేపీపై స్పందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మధ్యాహ్నం తరువాత సీన్ లోకి కేసీఆర్ ఎంటర్ కానున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంలో ముగ్గురిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్కు చెందిన నందకిషోర్ (ఏ2), తిరుపతికి చెందిన సింహాయాజి (ఏ3)పై కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ ఏసిపి తెలిపారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను పోలీసులు పొందుపరిచారు.

బిజెపిలో చేరితే రూ.100  కోట్లు ఇప్పిస్తామని సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి ఆఫర్ చేశారని.. నందకిషోర్ మధ్యవర్తిత్వంతో ఫామ్ హౌస్ కు సతీష్ శర్మ, సింహాయాజి వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరితే రూ.100 కోట్లు ఇస్తామని బిజెపి తరఫున వారు హామీ ఇచ్చినట్లు పైలట్ రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.

దొరికిందని చెబుతున్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?.. బీజేపీలో చేరాలనుకుంటే మధ్యవర్తులు అక్కర్లేదు: కిషన్ రెడ్డి

ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నట్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. బీజేపీ లో చేరితే సెంట్రల్ సివిల్ కాంట్రాక్టర్ తో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పిన విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు రోహిత్ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారం సీఎం కేసీఆర్ అల్లిన కట్టుకథ అని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఈ కుట్రతో పోలీసులు భాగస్వామయ్యం కావొద్దని సూచించారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశం మీద సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పై న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు లక్ష్మణ్ చెప్పారు. 

ఇక, ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం టిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడులో దెబ్బ తినబోతోందని హైదరాబాద్ వేదికగా డ్రామాలకు తెరలేపారని అన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఆ స్వామీజీలను పిలిపించుకుని మాట్లాడారని, అక్కడే స్క్రిప్టు రాసి.. అమలు చేస్తున్నారని అన్నారు.  బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎంకు సవాల్ విసురుతున్నా.. మీరు  యాదాద్రి వస్తారా? టైం, తేదీ మీరే చెప్పండి. బిజెపి తరఫున ఎవరు కోరుకుంటే వాళ్ళం వస్తాం. ఈ డ్రామా తో సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా?’  అని ప్రశ్నించారు.

 ఈ వ్యవహారానికి పూర్తి  స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రగతిభవన్ నుంచి  నడిచిందని, సీఎం  కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. ఇందులో సైబరాబాద్ కమిషనర్ నటుడిగా మారారని అన్నారు.  గతంలో మంత్రిపై హత్యాయత్నం అంటూ డ్రామాలు ఆడారని అది ఫెయిల్ అవడంతో ఇప్పుడు సరికొత్త నాటకమాడుతున్నారని అన్నారు.  కొన్ని సీన్లు ముందే పోలీసులు రికార్డు చేసి పెట్టుకున్నారని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios