Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే తొలిసారి విస్తృత రైతు సమావేశం.. రోజంతా రైతుల‌తోనే సీఎం కేసీఆర్ భేటీ!

దేశ‌వ్యాప్తంగా వివిధ రైతు సంఘాల ప్ర‌తినిధులతో తెలంగాణ సీఎం కేసీఆర్ శ‌నివారం సమావేశాన్ని నిర్వ‌హించారు. దాదాపుగా 20 రాష్ట్రాల నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన రైతుల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.
 

CM KCR Meeting With 26 States Farmers Union Leaders At Pragathi Bhavan
Author
First Published Aug 28, 2022, 6:17 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ శ‌నివారం వినూత్న సమావేశాన్ని నిర్వ‌హించారు. దేశంలో ఏ ముఖ్య‌మంత్రి చేప‌ట్టిన విధంగా చ‌రిత్ర‌లో తొలిసారి.. .దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన  రైతుల సంఘాల నాయ‌కుల‌తో  ఆయ‌న విస్తృత స్థాయి స‌మావేశ‌మ‌య్యారు. ప్రగ‌తి భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎం కేసీఆర్  అధ్యక్షతన వ‌హించారు. ఈ స‌మావేశం ఉద‌యం నుంచి రాత్రి దాకా సుధీర్ఘంగా కొన‌సాగింది. ఈ కార్యక్ర‌మంలో రైతు ప్రతినిధులు, జాతీయ రైతుసంఘాల నాయకులు సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వ్య‌వ‌సాయ ప‌రిస్థితులు, ప‌ద్ద‌తులు, ఆయా ప్ర‌భుత్వాల నుంచి అందుతున్న మ‌ద్ద‌తు, సాగులో నూత‌నంగా అందివ‌స్తున్న సాంకేతికత త‌దిత‌రాల‌పై కేసీఆర్ చ‌ర్చించారు. 

అలాగే..  తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు అందిస్తున్న మ‌ద్ద‌తును కూడా కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతన్న‌ల‌కు పూర్తిగా ఉచిత విద్యుత్ అందిస్తున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా.. రైతుల‌కు పెట్టుబ‌డి సాయంగా అందించే రైతు బంధు ప‌థ‌కం గురించి కేసీఆర్ వివ‌రించారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని జాతీయ రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం ముక్తకంఠంతో తీర్మానించింది.   

ఈ సంద‌ర్భంగా రైతు సంఘాల నేతలు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా ఖండించారు. పంటలు పండించడంతోపాటు, గిట్టుబాటు ధరలను కల్పించాల‌ని డిమాండ్ చేశారు. అసంఘటితంగా ఉన్న రైతాంగం సంఘ‌టితం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని కోరారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని రైతు సంఘాల నాయ‌కులు ఆకాంక్షించారు. దేశంలో సరికొత్త రైతు ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరమున్నదని వారు స్పష్టంచేశారు.

తెలంగాణ‌లో రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజుల పాటు కొనసాగింది. శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్న 26 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్‌ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

రెండో రోజు  శనివారం ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకున్న రైతు సంఘాల  నాయకులు తెలంగాణ‌లో  వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. ఆ తర్వాత వారంతా కలిసి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.ఇదిలా ఉంటే... శ‌నివారం స‌మావేశానికి హాజ‌రైన రైతుల‌తో కేసీఆర్ ఆదివారం కూడా స‌మావేశం కానున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios