తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు‌లు ప్రగతి భవన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి శాంతి కుమారి, టీఎస్‌పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి, సంబంధిత అధికారులు కూడా చేరుకున్నారు. ప్రగతి భవన్‌లోని నిర్వహించే కీలక సమావేశంలో.. పేపర్స్ లీక్, పరీక్షల రద్దు అంశాలపై చర్చించనున్నారు. 

ఇందుకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ చైర్మన్ నుంచి కేసీఆర్ వివరణ తీసుకునే అవకాశం ఉంది. అలాగే పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణ కూడా చర్చించనున్నారు. అలాగే టీఎస్‌పీఎస్సీ బోర్డు అంశంలో కూడా సీఎం కేసీఆర్ కీలక  నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతుంది. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)  ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం రోజున గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ), డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా బోర్డు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నివేదిక‌తో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్‌పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇక, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసును విచారిస్తున్న సిట్ తొమ్మిది మంది అనుమానితులను ఆరు రోజుల పోలీసు కస్టడీకి తీసుకోనుంది. ఈ కేసులో నిందితులను మరింతగా విచారించాల్సి ఉందని, వివరాలు రాబట్టాల్సి ఉన్నందున వారిని ఒక వారం కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శనివారం నుంచి నిందితులను ఆరు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.