కాంగ్రెస్ హయాంలోనే భద్రాచలం అభివృద్ధి చెందిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాష్ట్ర విభజన సమయంలో 7 మండలాలను ఏపీలో కలుపుతుంటే కేసీఆర్ నోరెత్తలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

భద్రాచలం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కంచుకోటేనన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హత్ జోడో యాత్ర మంగళవారం భద్రాచలానికి చేరుకుంది. రేవంత్ వెంట ఈరోజు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే పాటుపడిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సైతం చేసేందేమి లేదన్నారు. డిగ్రీ కాలేజీ, కరెంట్, ఆసుపత్రులు, ఐటీడీఏ, గోదావరి నదిపై బ్రిడ్జి కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. 

భద్రాచలానికి మంచినీటి సదుపాయాన్ని కూడా కల్పించింది కాంగ్రెస్సేనని ఆయన తెలిపారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో వున్న గిరిజనుల కోసం అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని విక్రమార్క గుర్తుచేశారు. 3 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చింది, పేదలకు పక్కా ఇళ్లు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు.తెలంగాణ వచ్చాక నీళ్లు, నిధులే కాదు.. నియామకాలు లేవని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ లక్ష్యం కోసం మళ్లీ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాల్ని ఏపీలో కలిపారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్యాలు నెరవేరాలంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భట్టి ఆకాంక్షించారు. అందుకే ఇక బీఆర్ఎస్ పాలన చాలని ప్రజలు నినదిస్తున్నారని విక్రమార్క దుయ్యబట్టారు. వరంగల్ డిక్లరేషన్‌ను తూచా తప్పకుండా అమలు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

ALso REad: కార్పోరేట్ శక్తులకు దోచిపెడుతున్నారు: మోడీపై అసెంబ్లీలో భట్టి విమర్శలు

ఇదిలావుండగా.. త్వరలోనే తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమానికి సంబంధించి తన పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను త్వరలోనే ప్రకటించనున్నట్టుగా విక్రమార్క చెప్పారు. ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి ఏం కామెంట్స్ చేశారో చూడలేదన్నారు. కాళేశ్వరమే కాదు అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురించి వాస్తవాలనే కేసీఆర్ మాట్లాడారని భట్టి దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో తాము పాల్గొంటామని భట్టి విక్రమార్క చెప్పారు.