ఆర్టీసీ బస్సులు రావడం లేదు.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు చిన్నారి లేఖ, స్పందించిన సజ్జనార్
పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు నడపడం లేదని ఓ విద్యార్థిని ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి విద్యార్ధిని ఈ లేఖ రాసింది
ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడం, లేదా రాకపోవడం లాంటి సమస్యల్ని దేశంలోని ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎవరైనా డిపో మేనేజర్ లేదా ఎవరైనా పెద్ద అధికారికి ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించాలని కోరతారు. ఓ చిన్నారి కూడా అదే పని చేసింది. అయితే ఆయన సామాన్య వ్యక్తి కాదు. సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం (supreme court) ప్రధాన న్యాయమూర్తి.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి (ranga reddy district) జిల్లా మేడ్చల్ (medchal) మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి అనే 8వ తరగతి విద్యార్థిని తమ గ్రామానికి ఆర్టీసీ బస్సులు సమయానికి రాకపోవడంతో విసిగిపోయింది. అంతే ఆ చిన్ని బుర్రకు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (cji) జస్టిస్ ఎన్వీ రమణకు (justice nv ramana) లేఖ రాసింది. ఆ విద్యార్థిని అభ్యర్థనపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఈ విషయాన్ని తక్షణం టీఎస్ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే అప్రమత్తమైన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీ బస్సులను తక్షణమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ ఎన్వీ రమణకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. ఆ సెంటర్లలో యూపీఐ సేవలు..
కాగా.. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. తనదైన మార్క్ను కనబరుస్తున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ట్విట్టర్లో కూడా యాక్టివ్గా ఉంటూ ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులో సాధారణ ప్రయాణికుడిగా టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుడా MGBS పరిసరాలను పరిశీలించారు. అక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి కూడా Sajjanar ఫ్యామిలీతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సింప్లిసిటీ చాటుకున్నారు.
ఇటీవల దసరా పండగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలను రద్దు చేశారు. ప్రయాణికులు.. ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా తనదైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సజ్జనార్ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్జప్తి మేరకు టీఎస్ఆర్టీసీలో యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా పెమేంట్స్ చేసే సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించామని చెప్పారు.