హైదరాబాద్‌ పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మార్చి 30వ తేదీన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్‌ పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మార్చి 30వ తేదీన శ్రీరామ నవమి కావడం ఆ రోజు రంజాన్ సాయంత్రం ప్రార్థనల సందర్బంగా నినాదాల నేపథ్యంలో.. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. బైక్‌పై వచ్చి నినాదాలు చేసిన ఓ వర్గం వారిపై మరో వర్గం వ్యక్తులు దాడి చేశారు. అయితే ఇందుకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఈ ఘర్షణను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరపుతున్నామని చెప్పారు. 

‘‘చార్మినార్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రంజాన్ సాయంత్రం ప్రార్థనల సమయంలో రామనవమి రోజున బైక్‌పై వచ్చి నినాదాలు చేసిన హిందూ సమాజానికి చెందిన కొంతమందిపై ముస్లిం వర్గానికి చెందిన కొంతమంది దాడి చేశారు’’ అని చార్మినార్ ఎస్‌హెచ్‌వో తెలిపినట్టుగా ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది.

చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్ మాట్లాడుతూ.. ‘‘మార్చి 30న శ్రీరామనవమీ బృందం రూట్‌ మార్చుకుని మరో మార్గంలో వెళ్లడంతో గందరగోళం ఏర్పడి ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి తరిమేశారు. అనుమతించిన రూట్‌లో వెళ్లనందుకు గ్రూప్‌పై కేసు పెట్టాం’’ అని తెలిపారు.