ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో మెడికో గణేష్ ప్రసాద్ ను సీఐడీ పోలీసులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో పదిమందికి లింకులున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సీఐడీ అధికారులు.


హైదరాబాద్: ఎంసెట్ పేపర్- లీకేజీలో మెడికో గణేష్ ప్రసాద్‌ను సీఐడీ శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య 91కు చేరుకొంది. 

ఎంసెట్ 2 పేపర్ లీకేజీ కేసులో తాజాగా మెడికో గణేష్ ప్రసాద్ అనే మెడికోను అరెస్ట్ చేయడంతో ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూసే అవకాశాలు లేకపోలేదని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే చైతన్య కాలేజీలో డీన్‌గా పనిచేసిన వాసుబాబు, చైతన్య,నారాయణ కాలేజీల్లో ఆడ్మిషన్ ఏజంట్‌గా వ్యవహరిస్తున్న శివనారాయణలను ఇటీవలనే సీఐడీ అరెస్ట్ చేసింది.

అయితే కార్పోరేట్ కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధుల పాత్ర బయటకు రావడంతో యాజమాన్యాల పాత్ర ఇందులో ఏమైనా ఉందా అనే కోణంలో కూడ సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే ఈ విషయమై ఈ కేసులో విచారణ జరిపే కొద్దీ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికో గణేష్ ప్రసాద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసుతో మరో పదిమందికి లింకులు ఉన్నాయని సీఐడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 

గణేష్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే ఈ విషయమై ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కార్పోరేట్ కాలేజీల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు యాజమాన్యాల పాత్ర కూడ ఉందా అనే కోణంలో కూడ సీఐడీ విచారణ చేయాలని భావిస్తోంది. ఇటీవలనే అరెస్టైన చైతన్య కాలేజీ డీన్ వాసుబాబు, కార్పోరేట్ కాలేజీల ఆడ్మిషన్ల ఏజంట్ శివన్నారాయణలను వారం రోజుల పాటు తమ కష్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది.

సీఐడీ పిటిషన్ మేరకు శుక్రవారం నాడు కోర్టు వారికి అనుమతిని ఇచ్చింది. కోర్టు అనుమతి రావడంతో చంచల్ గూడ జైలు నుండి శివన్నారాయణ, వాసుబాబును సీఐడీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సీఐడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.