ఆన్ లైన్ లోన్ యాప్... వెనక చైనా మహిళ
అక్కడ నుంచి ఆన్ లైన్ యాప్ లను ఆమె పర్యవేక్షిస్తున్నారు. తాజాగా దేశ్యవాప్తంగా ఇది తీవ్ర కలకలం రేపడంతో.. ఈ బండారం బయటపడింది.
ఇటీవల కాలంలో ఆన్ లైన్ లోన్ యాప్స్ తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ యాప్ లో రుణం తీసుకొని తీర్చలేక.. వారు పెడుతున్న వేధింపులు భరించలేక.. ఇటీవల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అతని మరణంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఇంత వివాదాస్పదమైన ఈ రుణ యాప్ ల సృష్టికర్త చైనాకు చెందిన ఓ మహిళ అని తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరిలో భారత్ వచ్చిన ఆమె గురుగ్రామ్, ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ విస్తరించడంతో ఏప్రిల్ లో తిరిగి చైనా వెళ్లిపోయారు. కాగా.. అక్కడ నుంచి ఆన్ లైన్ యాప్ లను ఆమె పర్యవేక్షిస్తున్నారు. తాజాగా దేశ్యవాప్తంగా ఇది తీవ్ర కలకలం రేపడంతో.. ఈ బండారం బయటపడింది.
అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక్కో రుణయాప్ లో 20-30 వరూ లింక్ యాప్ లు ఉన్నాయని గుర్తించారు. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా.. వారిని గురువారం నగరానికి తీసుకువచ్చారు. వారిని జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. ఇప్పటికే హైదరాబాద్ లో అరెస్టు అయిన ఆరుగురు నిందితులను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
రుణయాప్ ల ద్వారా నగదు తీసుకున్నవారి నుంచి తిరిగి వసూలు చేసే బాధ్యత పూర్తిగా కాల్ సెంటర్లదే. రోజుకు రూ.20 కోట్లు వసూలు చేయాలనేది నిర్వాహకులు నిర్దేశించిన లక్ష్యం. ఒక్కో టెలీకాలర్ నుంచి రోజూ కనీసం 60 మందికి ఫోన్ చేయాలి. సొమ్ము వసూలు చేయడానికి ఎలా మాట్లాడినా ఇబ్బంది లేదని భరోసా ఇస్తారు. దీంతో టెలికాలర్స్ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ రుణం తీసుకున్న వారిని మానసికంగా హింసిస్తున్నారని తెలుస్తోంది.