కేంద్రం ట్విస్ట్ తోనే చంద్రబాబుకు మోత్కుపల్లి మంట
బిజెపి ఇచ్చిన ట్విస్ట్ కారణంగానే మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దక్కలేదనే విషయం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ట్విస్ట్ కారణంగానే మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి దక్కలేదనే విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ అందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. గవర్నర్ పదవి దక్కకపోవడం వల్లనే మోత్కుపల్లి నర్సింహులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు ఆయన అన్నారు.
తమిళనాడు గవర్నర్ పదవి దొరక్కపోవడం వల్లనే మోత్కుపల్లి విపరీత ధోరణితో మాట్లాడటం ప్రారంభించారని ఆయన తెలిపారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి కోసం చంద్రబాబు ఎంతగానో ప్రయత్నించారని చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రి పదవిలో ఉన్నప్పుడే దీనిపై అన్ని ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.
అందుకు సంబంధించి ఓ లేఖను కూడా చంద్రబాబు సిద్ధం చేశారని తెలిపారు. కేరళకు గవర్నర్గా మోత్కుపల్లిని పంపిద్దామనుకున్నారని చెప్పారు. అయితే ఆయన తమిళనాడుకు వెళ్లాలని తాపత్రయపడ్డారని అన్నారు. ఆ విషయం తన దగ్గర కూడా ప్రస్తావించారని రమణ తెలిపారు.
కేంద్రం దానికి అంగీకరించకపోవడం, ఆ తర్వాత కేంద్రం నుంచి టీడీపీ బయటకు వచ్చేయడం వెంటవెంటనే జరిగిపోయాయని చెప్పారు. మోత్కుపల్లి అందుకే చంద్రబాబుపై, పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేశారని రమణ అన్నారు.