తలొగ్గని కేంద్రం .. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణకు మొండిచేయి, యాసంగిలో వరి వద్దని కుండబద్ధలు
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిరాశే ఎదురైంది. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం .. రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో (piyush goyal) శుక్రవారం తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం భేటీ అయింది. ఈ సమావేశంలో యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పింది
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిరాశే ఎదురైంది. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం .. రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో (piyush goyal) శుక్రవారం తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (niranjan reddy), ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelly dayakar rao), మల్లారెడ్డి (malla reddy) ఎంపీలు నామా నాగేశ్వర్ రావు (nama nageshwara rao) , బీబీ పాటిల్, సురేశ్ రెడ్డి పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పిందన్నారు. తాము ఎంతో ఆశతో వచ్చామని.. కానీ కేంద్రం నిరాశపరిచిందని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించామని.. ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్ చెప్పమన్నామని ఆయన తెలిపారు. ఏడాదికి ఒకేసారి టార్గెట్ ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. భేటీ వివరాలను సీఎం కేసీఆర్కు వివరిస్తామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
ALso Read:ధాన్యం కొనుగోలు రగడ .. మరోసారి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు భేటీ
అంతకుముందు ఈ నెల 23న మంత్రి కేటీఆర్ (ktr) నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్గోయల్, నరేంద్రసింగ్ తోమర్తో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. నాటి భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్పష్టత రాకపోవడంతో కేంద్ర మంత్రులు ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని ప్రతిపాదించారు. ఈ మేరకు ఈ రోజు తెలంగాణ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసింది.
కాగా.. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం తీరుపై టీఆర్ఎస్ (trs protest) పోరాటం చేస్తోంది. ఇప్పటికే ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాకు దిగింది టీఆర్ఎస్. కేంద్రం నుండి రెండు మూడు రోజుల్లో స్పష్టత రాకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఇందిరా పార్క్ వద్ద మహ ధర్నా సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.
వరి ధాన్యంపై తాడోపేడో తేల్చుకొనేందుకు కేసీఆర్ (kcr delhi tour) ఢిల్లీకి సైతం వెళ్లొచ్చారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి ఎఫ్సీఐకి (fci) ఆదేశాలు ఇవ్వాలని కూడా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పింది. రా రైస్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని తెలంగాణ సర్కార్ చెబుతుంది.. కేంద్రం ధాన్యం కొనుగోలుకు సిద్దంగా లేనందునయాసంగిలో వరి పంట వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది.