ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి ఎసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఎసీబీ పరిధిలోకి రాదని అంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఎసీబీ కోర్టు కొట్టేసింది.
ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో అన్నారు. దానితో ఏసీబీ కోర్టు విభేదించింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.
అభియోగాల నమోదు కోసం విచారణను ఏసీబీ కోర్టు ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8వ తేదీన నిందితులు తమ ముందుకు రావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ కు లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరి, మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.