ఈ ఓటమిని గుణపాఠంగా భావిస్తాం..: కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (KTR) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు కామన్ అని పేర్కొన్నారు.
![BRS Working President, KT Ramarao Press Meet at Telangana Bhavan KRJ BRS Working President, KT Ramarao Press Meet at Telangana Bhavan KRJ](https://static-ai.asianetnews.com/images/01hexssae2se7fwrtejr8p0tx7/ktr-jpg_363x203xt.jpg)
KTR: తెలంగాణ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (KTR) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేము ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు కామన్ అని, ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామనీ, ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడిపోతామని తెలిపారు. ఈ ఓటమిని ఎదురుదెబ్బగా, గుణపాఠంగా భావిస్తామని అన్నారు. స్వల్ప తేడాతో చాలా మంది అభ్యర్థులు ఓడిపోయారనీ, ఓటమి గల కారణాలన విశ్లేషిస్తామని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. గతం కన్నా మెజార్టీ సాధిస్తామని ఆశాభావంతో ఎన్నికలకు వెళ్లామని, కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అన్నారు. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని అన్నారు.119 సీట్లకు గాను 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్రలో కూడా తాము ఇమిడిపోతామని అన్నారు. గత పదేళ్లు ప్రభుత్వాన్ని అప్పగిస్తే సమర్థంగా నడిపించామనీ, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సేవలందిస్తామని అన్నారు.
ఈ ఎదురు దెబ్బను పాఠంగా నేర్చుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
23 ఏళ్లలో తమ పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలు చూశామనీ, ప్రజల దయతో పదేళ్లు అధికారంలో ఉన్నామని అన్నారు. మేం చేసిన పనిపట్ల సంతృప్తి ఉందనీ, ఓడిపోయామన్న బాధ, అసంతృప్తి లేదని అన్నారు. గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తామనీ, ఎవరూ నిరాశకు గురికావొద్దని ధైర్యం చెప్పారు. రాజకీయాలు, జీవితంలో గెలుపోటమిలు సర్వసాధారణమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారనీ, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ కోల్పోయాయో అక్కడ గెలుస్తామని చెప్పుకొచ్చారు.