Asianet News TeluguAsianet News Telugu

అందుకోసమే 'చలో మేడిగడ్డ' : కేటీఆర్ కవితాత్మక కామెంట్స్

నేడు బిఆర్ఎస్ 'చలో మేడిగడ్డ' నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికన ఓ కవిత్వాన్ని పోస్ట్ చేసారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నారో తన కవితాత్మక ట్వీట్ ద్వారా కేటీఆర్ వివరించారు.   

BRS Working President KCR Poetry on Chalo Medigadda Programme AKP
Author
First Published Mar 1, 2024, 9:06 AM IST

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ... తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే బర్నింగ్ టాపిక్. ఈ ప్రాజెక్ట్ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటలయుద్దం సాగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ కమీషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నాసిరకంగా నిర్మించినా పట్టించుకోలేదని... అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి కూలడానికి సిద్దంగా వుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బిఆర్ఎస్ మాత్రం మేడిగడ్డను కూలిపోయేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని... తద్వారా కేసీఆర్ ను బదనాం చేయాలన్నది వారి  ఆలోచనగా పేర్కొంటున్నారు. ఇలా కాళేశ్వరంపై వివాదం సాగుతున్న వేళ బిఆర్ఎస్ 'చలో మేడిగడ్డ' కార్యక్రమం చేపడుతుండటం పొలిటికల్ హీట్ పెంచుతోంది. 

మార్చి 1న అంటే ఇవాళ తెలంగాణకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక ప్రజా ప్రతినిధులు, మాజీలు మేడిగడ్డను పరిశీలించనున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సారధ్యంలో ఈ 'చలో మేడిగడ్డ' కార్యక్రమం సాగనుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ లోని బిఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ నుండి వీళ్లంతా మేడిగడ్డకు పయనం కానున్నారు. ఈ సమయంలో అసలు 'చలో మేడిగడ్డ' ఎందుకో కవితాత్మకంగా తెలియజేసారు కేటీఆర్.  

కేటీఆర్ ట్వీట్ యధావిధిగా :

మళ్లీ తెలంగాణను 
ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు
ఎండగట్టడానికే... ఈ “చలో మేడిగడ్డ”

చిన్న లోపాన్ని.. 
పెద్ద భూతద్దంలో చూపిస్తూ..
బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజస్వరూపాన్ని 
బట్టబయలు చేసేందుకే...  ఈ “చలో మేడిగడ్డ”

ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును 
పరిరక్షించకుండా.. కూలిపోవాలని చూస్తున్న 
కాంగ్రెస్ కుతంత్రాన్ని ప్రజల సాక్షిగా నిలదీయడానికే.. 
ఈ “చలో మేడిగడ్డ”

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 
పండుగలా మారిన వ్యవసాయాన్ని
మళ్లీ దండగలా మార్చే కాంగ్రెస్ పన్నాగాలకు 
పాతరేసేందుకు ఈ “ చలో మేడిగడ్డ ”

పంజాబ్ నే తలదన్నే స్థాయికి ఎదిగిన 
తెలంగాణ రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న
కాంగ్రెస్ నీచ సంస్కృతికి సమాధి కట్టేందుకే
ఈ “చలో మేడిగడ్డ”

మరమ్మత్తులు కూడా చేతకాని “గుంపుమేస్త్రీ”ని 
నమ్ముకుంటే తెలంగాణ రైతు నిండా మునుగుడే..
అని మరోసారి చాటిచెప్పేందుకే ఈ “చలో మేడిగడ్డ”

దశాబ్దాలపాటు.. 
కాంగ్రెస్ చేసిన తప్పులను.. 
కాంగ్రెస్ పాలనలో సాగునీటి తిప్పలను.. 
అరవై ఏళ్లు కాంగ్రెస్ పెట్టిన అరిగోసను 
అన్నదాతలు మరువలేదని గుర్తుచేసేందుకే.. 
ఈ “చలో మేడిగడ్డ”

మళ్లీ కన్నీటి సాగుకు 
తెలంగాణను కేరాఫ్ గా మారిస్తే సహించం..

మీ దుష్ట రాజకీయాల కోసం.. 
మా తెలంగాణ రైతాంగాన్ని బలిచేస్తే భరించం..

పోటీ యాత్రలు చేయడం కాదు.. 
ప్రజలు అప్పగించిన డ్యూటీ చేయండి..

మేడిగడ్డకు మరణశాసనం రాయాలని చూస్తే... 
తెలంగాణ గడ్డపై.. కాంగ్రెస్ కే నూకలు చెల్లడం ఖాయం
వచ్చే వరదల్లో.. కాంగ్రెస్ పార్టీయే కొట్టుకుపోవడం తథ్యం

జై తెలంగాణ
జై కాళేశ్వరం
జై బీఆర్ఎస్

 

Follow Us:
Download App:
  • android
  • ios