Teegala Krishna Reddy: పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు ఆ పార్టీ నేత సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినా ఆ కీలక నేత త్వరలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరు? 

Teegala Krishna Reddy: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్‌ చేరికలపై దృష్టి సారించింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ లోని ముఖ్యనేతలనే టార్గెట్‌గా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ కు శ్రీకారం చుట్టింది. ఈ తరుణంలో కీలక నేతలతో రహస్య మంతనాలు జరుపుతోంది. తత్ఫలితంగా బీఆర్ఎస్ (BRS Leader) నేత తన పార్టీని వీడి.. కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. అతడే.. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్‌ నగర మాజీమేయర్‌ తీగల కృష్ణారెడ్డి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డి.. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం. ఈ వార్తల్లో నిజం లేక పోలేదు.. శనివారం నాడు ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంతో.. కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారానికి ఊతమిచ్చినట్టు అయ్యింది. ఇదే తరుణంలో ఆయన వచ్చే నెల మొదటి వారంలో అమీర్‌పేటలో బహిరంగసభ నిర్వహించి.. అక్కడ సీఎం సమక్షంలో పార్టీలో చేరబోతున్నారనీ, ఈ మేరకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

తీగల కృష్ణారెడ్డి గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. ఇలా పార్టీ టికెట్ లభించకపోవడంతో ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరిగింది. కానీ, పార్టీ నేతలతో అంతర్గత భేటీ అయినా తరువాత తన నిర్ణయాన్ని తాత్కాలికంగా ఆపేశారు.

కానీ, తాజాగా ఆయన సీఎం రేవంత్‌ను కలవడంతో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే.. రేవంత్‌ రెడ్డిని కలిసే ముందు తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డిజిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి.. మంత్రి కొండా సురేఖని కలిసినట్టు తెలుస్తోంది. తరువాత కృష్ణారెడ్డి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి,. కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

తీగల బాటలో మోత్కుపల్లి 

తీగల బాటలో మోత్కుపల్లి నర్సింహులు నడవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలన జన రంజకంగా ఉందంటూ కితాబు ఇస్తున్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ మేరకు శనివారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల పాలన చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఒరవడితో ముందుకు సాగుతుందనీ, ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉన్నదని భావనను కల్పిస్తుందని ప్రశంసించారు. ఇలా సీఎం రేవంత్ తో భేటీ కావడంతో మోత్కుపల్లి భేటీ కావడంతో ఆయనకు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే చర్చ మొదలైంది.