హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి నేతలు నిరసనకు దిగారు.
హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేటు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి నేతలు నిరసనకు దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ దీష్టిబొమ్మను దగ్దం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా బీజేపీ ప్లెక్సీలను కూడా దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్వీ నేతలు ప్రయత్నించారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్వీ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో పోలీసులు టీఆర్ఎస్వీ నేతలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీసు స్టేషన్ను తరలించారు. దీంతో కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బీజేపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని బీఆర్ఎస్వీ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా బీజేపీకి నిరుద్యోగ మార్చ్ నిర్వహించే హక్కు లేదని వారు విమర్శించారు. బీజేపీ నిరుద్యోగ మార్చ్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్లో బీజేపీ ఈరోజు నిరుద్యోగ మార్చ్ నిర్వహించనుంది. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
