జగిత్యాలలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్టువస్త్రాలు పంపించారు. 

జగిత్యాల : దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామాలయాలతో పాటు ప్రముఖ దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండగగా జరుగుతోంది. ఇలా తెలంగాణలోని జగిత్యాల పట్టణంలో జరిగిన కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు పంపించారు. అలాగే ఇవాళ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమానికి కూడా కవిత 1,51,000 రూపాయలు విరాళంగా అందించారు. 

కవిత పంపించిన పట్టు వస్త్రాలను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీతారామచంద్రులకు సమర్పించారు. భార్య రాధికతో కలిసి  కోదండ రామాలయానికి చేరుకున్న సంజయ్ సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. 

Read More  హైదరాబాద్‌లో వైభవంగా కొనసాగుతున్న శ్రీరాముని శోభాయాత్ర..

ఇదిలావుంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి నుండే స్వామివారి ప్రత్యేక పూజలు, పెళ్ళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మిథిలా స్టేడియంలో అశేష జనవాహిని మధ్య సీతారాముల కళ్యాణం జరిగింది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు. 

భద్రాచలం సీతారాముల కళ్యాణాన్ని చినజీయర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ అసెంబ్లీ  స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు రవిచంద్ర, కవిత తదితరులు కనులారా వీక్షించారు. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు  వచ్చే భక్తుల కోసం  అధికారులు విస్తృతంగా  ఏర్పాట్లు  చేశారు.