తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అనుచిత వ్యాఖ్యలకు గాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీలోని జాతీయ మహిళా కమీషన్ ఎదుట ఆయన హాజరయ్యారు.  

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మంగళవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమీషన్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలకు గాను ఆయన కమీషన్‌కు క్షమాపణలు చెప్పారు. అలాగే గవర్నర్‌కు కూడా లేఖ ద్వారా క్షమాపణలు చెప్తానని కౌశిక్ రెడ్డి కమీషన్‌కు తెలిపారు. 

ఇక, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిస సౌందర్‌రాజన్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో పాస్ చెసిన‌ బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ ఎందుకు క్లియర్ చేయడం లేదంటూ ప్రశ్నించే క్రమంలో కౌశిక్ రెడ్డి అనుచిత పదజాలాన్ని వినియోగించారు.

ALso REad : తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు.. జాతీయ మహిళా కమీషన్ సీరియస్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి నోటీసులు

ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులు కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కూడా కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అలాగే కౌశిక్ రెడ్డిపై గత నెల 28న బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయనను భర్తరప్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు కోరారు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుచేసేలా డీజీపీకి అదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా కౌశిక్ రెడ్డి రాజ్యాంగ పదవిని అగౌరవ పరిచాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. నెల 21న ఢిల్లీలోని కమీషన్ కార్యాలయం ముందు హాజరుకావాలని ఆదేశించింది.