సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలవనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ  రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు ఏచూరిని ఆహ్వానించనున్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని ఆహ్వానించారు కల్వకుంట్ల కవిత. 

కాగా.. జంతర్ మంతర్ వద్ద దీక్ష వేదికకు సంబంధించి పలు షరతులు విధిస్తూ ఢిల్లీ పోలీసులు కవిత సిబ్బందికి సూచించారు. ఈ రోజు కవిత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే పోలీసులు ఈ విషయంపై కవితకు పేపర్ మీద రాసి సమాచారం చేరవేశారు. దీనిపై స్పందించిన కవిత.. తాము ముందుగానే దీక్షకు అనుమతి తీసుకున్నామని చెప్పారు. ముందు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు ఈ విధంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ దీక్షలో ఎలాంటి మార్పు లేదని.. జంతర్ మంతర్ వద్ద దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

మీడియా సమావేశం అనంతరం కవిత నేరుగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. అక్కడ దీక్షకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జంతర్ మంతర్ వద్ద సగం స్థలం మాత్రమే వాడుకోవాలని ఢిల్లీ పోలీసులు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని కవిత కూడా మీడియాకు వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ.. 5 వేల మంది వస్తారని చెప్పి.. 10 రోజుల కిందటే పర్మిషన్ కోసం ఆప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందన్నారు. అందుకు అనుమతి కూడా ఇచ్చారని చెప్పారు. 

ALso REad: ఈడీ ఎందుకు తొందరపడుందో అర్థం కావడం లేదు.. విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్సీ కవిత

కానీ ఇప్పుడు ఇక్కడే బీజేపీ వాళ్లది కూడా ధర్నా ఉందని చెబుతున్నారని తెలిపారు. తమ వాళ్లు పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారని చెప్పారు. ముందుగా ఇచ్చిన పర్మిషన్ మేరకు తమ కార్యక్రమం నిర్వహించుకునేలా చూడాలని కోరారు. పర్మిషన్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభించుకోవాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభం కావాల్సి ఉందని అన్నారు. అయితే కొంత ఇబ్బందులకు గురిచేస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పారు.

అయితే సాయంత్రానికి కవిత దీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. జంతర్‌మంతర్ వేదిక వద్ద నుంచి తాము దీక్షను ఉపసంహరించుకుని మరోచోటికి మార్చుకుంటున్నట్లు బీజేపీ తెలిపింది. ఈ మేరకు దీన్ దయాళ్ మార్గ్‌లో తాము ధర్నా చేస్తామని ఢిల్లీ పోలీసులకు బీజేపీ సమాచారం అందించింది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.