ఢిల్లీ లిక్కర్ స్కాం : రేపు ఈడీ విచారణకు వెళ్లకూడదని కవిత నిర్ణయం, సుప్రీంకోర్టులో కేసు తేలాకే ఏదైనా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే రేపు విచారణకు హాజరుకాకూడదని కవిత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు బదులుగా కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. రేపు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరుకాకూడదని కవిత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. లీగల్ నోటీసులపై న్యాయ విచారణ తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తేలాకే ఈడీ విచారణకు వెళ్లాలని కవిత నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆమెకు బదులుగా కవిత తరపు న్యాయవాదులు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కామారెడ్డిలో భారీ బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
Also Read: మోడీ నోటీసు వచ్చింది.. సీరియస్గా తీసుకోనక్కర్లేదు, లీగల్ టీమ్ పరిశీలిస్తోంది : కల్వకుంట్ల కవిత
అంతకుముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంపిన నోటీసులపై కవిత స్పందించారు. నిజామాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోడీ నోటీసు వచ్చిందన్నారు. దానిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కవిత కొట్టిపారేశారు. ఇది రాజకీయకక్షతో వచ్చిందేనని.. ఏడాది నుంచి టీవీ సీరియల్ మాదిరిగా నడిపిస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. ఈడీ నోటీసులపై తమ పార్టీ లీగల్ సెల్ వాటిని పరిశీలిస్తోందని.. న్యాయ నిపుణుల సలహాను అనుసరించి నిర్ణయం తీసుకుంటానని కవిత స్పష్టం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసని మొదటి నుంచి చెబుతూనే వున్నామని కవిత వ్యాఖ్యానించారు.