బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. తాజాగా ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణకు రాగా.. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను జూలై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలోనాన్ మిసిలేనియస్ రోజులలో జరుపుతామని పేర్కొంది. అప్పటివరకు దర్యాప్తుపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐ విచారణ చేసేందుకు తెలంగాణ హైకోర్టు గతేడాది డిసెంబర్లో అనుమతి ఇచ్చింది. గతేడాది అక్టోబర్ 26న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తూ పోలీసులకు ముగ్గురు పట్టుబడ్డారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ విషయమై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు విచారణకు గాను హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే సిట్ తో కాకుండా సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది.బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తో పాటు మరో నలుగురు ఇదే డిమాండ్ తో పిటిషన్లను దాఖలు చేశారు. అయితే టెక్నికల్ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్న తెలంగాణ హైకోర్టు బీజేపీ సహా మరొకరి పిటిషన్ ను కొట్టివేసింది.ఈ కేసును సీబీఐ విచారణ కోరుతూ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకాదు సిట్ దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
