Telangana assembly elections 2023: బిఆర్ఎస్ టికెట్ల పంచాయితీ... ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలే షాక్..!
ఇప్పటికే మరోసారి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవంటూ ప్రచారం జరుగుతున్నవేళ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు సొంత పార్టీ నేతలు షాకిచ్చారు.
కొత్తగూడెం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార బిఆర్ఎస్ పార్టీ సంసిద్దమవుతోంది. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయిన పలువురు సిట్టింగ్ లకు ఈసారి టికెట్ నిరాకరించే అవకాశాలున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుంది. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియను పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నారట. ఈ ప్రచారమే నిజమయితే బావుంటుందని ఇల్లందు నియోజకవర్గానికి చెందిన కొందరు బిఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారు.
ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకుని హరిప్రియ భర్త హరిసింగ్ అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నాడని... చివరకు సొంత పార్టీ నాయకులపైనా కేసులు పెట్టిస్తున్నాడని ఇల్లందు బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా బిఆర్ఎస్ పార్టీకి చెడ్డపేరు తేవడమే కాదు ప్రజల విశ్వాసాన్ని కూడా ఎమ్మెల్యే కోల్పోయిందని అంటున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్లు మరోసారి హరిప్రియకు టికెట్ ఇవ్వొద్దని కేసీఆర్ నిర్ణయించివుంటే తాము స్వాగతిస్తున్నామని ఇల్లందు నాయకులు పేర్కొన్నారు.
శనివారం స్థానిక మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్ రావు ఇంట్లో ఇల్లందు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియకు వ్యతిరేకంగా ఈ సమావేశం కొనసాగింది. హరిప్రియకు కాకుండా ఈసారి వేరేవారికి టికెట్ ఇవ్వాలని... ఆమె కాకుండా ఎవరిని బరిలోకి దింపినా గెలిపించుకుంటామని నాయకులు బిఆర్ఎస్ అదిష్టానానికి సూచించారు.
Read More కాంగ్రెస్కు నాయకుల్లేరు, బీజేపీకి కేడర్ లేదు.. కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా : హరీశ్ రావు
ఎమ్మెల్యే హరిప్రియ భర్త బానోతు హరిసింగ్ అవినీతి, అక్రమాలు మరీ మితిమీరిపోయాయని నాయకులు ఆరోపించారు. భూదందాలు,సెటిల్ మెంట్లకు పాల్పడటమే కాదు సొంతపార్టీ నాయకులపైనా కేసులు పెట్టించి వేదిస్తున్నాడని... దీంతో ఇప్పటికే చాలామంది పార్టీకి దూరమయ్యారని అన్నారు. ఇలా ఎమ్మెల్యే భర్త తీరుతో ఇల్లందులో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని... అయినా మళ్లీ హరిప్రియకే టికెట్ ఇస్తే ఓటమి తప్పదని అంటున్నారు. కాబట్టి ఈసారి పార్టీకోసం పనిచేసిన వేరే ఎవరికైనా టికెట్ ఇవ్వాలని... అయితేనే ఇల్లందులో బిఆర్ఎస్ గెలుపు సాధ్యమని అంటున్నారు.
ఇల్లందు నియోజకర్గంలో అభివృద్ది పనులను ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లకు అప్పగించిన ఎమ్మెల్యే దంపతులు భారీగా కమీషన్లు పొందారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలా హరిప్రియ అవినీతి, అక్రమాల చిట్టా చాలానే వుందని... ఇవన్నీ పార్టీ అధినేత కేసీఆర్ కు చెప్పే అవకాశం తమకు లేదని అన్నారు. అందువల్లే ఇల్లందు బిఆర్ఎస్ నాయకులమంతా కలిసి హరిప్రియకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అభ్యర్ధిని మారిస్తే తప్ప ఇల్లెందులో పార్టీ గెలిచే అవకాశం లేదని బిఆర్ఎస్ నాయకులు అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే ఇప్పటికే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కూతురు అనురాధకు ఈసారి ఇల్లందు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇల్లందు నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గుమ్మడి నరసయ్య. కానీ తన పదవీకాలం అంతా ప్రజల మధ్య గుమ్మడి నరసయ్య గడిపారు. ఎలాంటి హంగూ, ఆర్భాటాల జోలికి ఆయన వెళ్లలేదు.ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఆయన కుటుంబానికి ఈసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారట.
దీంతో హరిప్రియ స్థానంలో మహిళను, ఓ కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తోందట. ఆ సమయంలోనే స్థానిక నాయకులు కొందరు గుమ్మడి అనురాధ పేరు సూచించడం, వయసురీత్యా గుమ్మడి నరసయ్యకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో కుదిరితే అనురాధాను టిఆర్ఎస్ తరఫున పోటీ చేయించాలని అనుకుంటున్నారట.