మిస్ వరల్డ్ 2025 కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. నేరుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వ్యవహారతీరును తెలియజేస్తూ సూటిగా ప్రశ్నలు సంధించారు.
Miss World 2025 : తెలంగాణలో మిస్ వరల్డ్ 2025 పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీల కోసం .ప్రపంచదేశాల నుండి అందగత్తెలు హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే ఈ అందాల పోటీల ద్వారా తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల సుందరీమణులను రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాల సందర్శనకు తీసుకెళుతున్నారు. ఇదే ఇప్పుడు నిరుపేదల పాలిట శాపంగా మారిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు.
అందాల పోటీల్లో పాల్గొంటున్న అందాల భామలు బుధవారం వరంగల్ లో పర్యటించారు. ఈ క్రమంలో మురికికాల్వలు కనిపించకుండా పరదాలు కట్టడం, రోడ్డుపక్కన చిరు వ్యాపారాలు నిర్వహించుకునే షెడ్ లను తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారు అధికారులు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఎండగడుతూ నేరుగా ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి ట్యాగ్ చేసి ఎక్స్ లో ఓ పోస్ట్ చేసారు మాజీ మంత్రి కేటీఆర్.
''హలో రాహుల్ గాంధీజి, బుల్డోజర్ కంపనీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమయినా సీక్రెట్ ఒప్పందం చేసుకుందా? పేదలకు జీవనోపాధి అందించే నిర్మాణాలను అమానవీయంగా కూల్చేయడం వెనక అర్థమేంటి. వరంగల్ రోడ్డుపక్కన చిరు వ్యాపారుల తాత్కాలిక నిర్మాణాలను ఎందుకు ధ్వంసం చేసారు. మిస్ వరల్డ్ పోటీదారులకు అందంగా కనిపించాలని పేదల జీవనోపాధిపైనే దెబ్బకొట్టారుగా... ఇదేనా ప్రజాపాలన'' అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
''ఏకంగా రూ.200 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ప్యాలస్ లలో డిన్నర్లు, ఇతర విలాసాల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు రాక్షస బుల్డోజర్లతో పేదల జీవితాలను చిదిమేస్తారా? కాంగ్రెస్ సర్కార్ సిగ్గులేకుండా చేపట్టిన ఈ అమానవీయ చర్యలకు సమాధానం చెప్పాలి'' అని రాహుల్ గాంధీని డిమాండ్ చేసారు కేటీఆర్.