Hyderabad: ట్విట్టర్ లో బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ అవినీతి, కవిత అరెస్టుపై బీజేపీ యానిమేటెడ్ వీడియోను షేర్ చేయగా, ప్రధాని మోడీ అవినీతిని నిరసిస్తూ వరుస కార్టూన్ చిత్రాలతో బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది.
BRS, BJP Twitter War: రాష్ట్రంలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ సోషల్ మీడియాలో సరికొత్త యుద్ధానికి తెరలేపాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో క్రియేటివ్ పోస్టర్ల ద్వారా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమ పొలిటికల్ డ్రామాను కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందంటూ బీజేపీ మొదట ఒక యానిమేషన్ వీడియోతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఎదురుదాడికి దిగిన బీఆర్ఎస్ దాన్ని 'భ్రష్టాచారి జుమ్లా పార్టీ'గా అభివర్ణించింది. బీజేపీని విమర్శిస్తూ బీఆర్ఎస్ సైతం యానిమేషన్లతో ఎదురుదాడికి దిగింది.
'కేంద్ర ప్రభుత్వ నిధులు, జీఎస్టీ'ని కేసీఆర్గా కనిపించే వ్యక్తి తన 'ఖజానా'గా మార్చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో యానిమేషన్ వీడియోను షేర్ చేసింది. "అవినీతిలో కూరుకుపోయి, కుంభకోణాల్లో మునిగితేలుతూ, తెలంగాణను సర్వనాశనం చేస్తూ, తనకు చేతనైనంత చేస్తున్నారు" అంటూ పేర్కొంది.
కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ చేసిన యానిమేటెడ్ వీడియోకు బీఆర్ఎస్ బదులిస్తూ 'బ్రష్టాచారి జుమ్లా పార్టీ'గా అభివర్ణించింది. అదానీ వ్యవహారంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమేయం ఉందంటూ 'ఎవరు మాట్లాడుతున్నారో చూడండి' అనే శీర్షికతో వరుస కార్టూన్ చిత్రాలను పోస్ట్ చేసింది.
ఇలా వరుస కార్టూన్లతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వార్ చేస్తున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టు, ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న క్రమంలో బీజేపీ అధికార పార్టీపై విమర్శల దాడులు చేసింది. బీజేపీ కౌంటరిస్తూ బీఆర్ఎస్ సైతం ఎదురుదాడికి దిగింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో నిరసనలకు పిలుపునిచ్చింది.
