బుర్ఖా వేసుకొని అమ్మాయిల హాస్టల్ లోకి..
అధికారులకు పట్టుబడటంతో.. ఆత్మహత్య
తన స్నేహితురాలిని కలుసుకునేందుకు బుర్ఖా వేసుకొని.. అమ్మాయిల హాస్టల్ లోకి వెళ్లాడు ఓ యువకుడు. అక్కడ హాస్టల్ సిబ్బందికి దొరికిపోవడంతో.. మనస్థాపంతో చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మహబూబ్నగర్ జిల్లాలోని మద్దూరు మండలం బూనీడు గ్రామానికి చెందిన సద్దాం హుసేన్ (21) పాలమూరు యూనివర్శిటీలో ఇంటిగ్రేటేడ్ కెమిస్ట్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 16న తన క్లాస్ మెట్ ని కలిసేందుకు ..బుర్ఖా వేసుకొని అమ్మాయిల హాస్టల్ లోకి వెళ్లాడు. ఇరుగు పొరుగు గదుల విద్యార్థినుల సమాచారంతో యువకుణ్ని, అతణ్ని లోనికి తీసుకువచ్చిన విద్యార్థినిని మేట్రన్ మందలించి పంపించారు.
సిబ్బంది సద్దాం సెల్ఫోను తమ దగ్గరే పెట్టుకొని మరుసటిరోజు ఉదయం వచ్చి తీసుకువెళ్లాలని సూచించారు. మరోమారు హాస్టల్ లోకి రానని లేఖ రాయించుకున్నారు. తన చెల్లితో కలిసి హాస్టల్ చూడటానికి వచ్చినట్లు అతను లేఖలో రాశాడు. తెల్లారితే మళ్లీ ఏమవుతుందో అనే భయంతో సద్దాం అదే రోజు (బుధవారం) రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
గురువారం ఉదయం మహబూబ్నగర్ శివారు మన్యంకొండ వద్ద మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు గుర్తుతెలియని శవంగా పత్రికలకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం విషయం తెలుసుకున్న సద్దాం తల్లిదండ్రులు మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఫోను చేస్తే వసతిగృహ, పీయూ సిబ్బంది స్పందించలేదని, తన కుమారుడి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్.ఐ. రాఘవేందర్ తెలిపారు.