బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ని ఓడించి తీరుతానని ఆమె సవాల్ విసిరారు. 

జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి ఆమె రాజీనామా చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసి గత నెల 25న మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు భోగ శ్రావణి. ఈ క్రమంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, 37వ వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. 

మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన తనకు ప్రజల నుండి, వివిధ సంఘాల నుండి ఎంతో మద్దతు, భరోసా లభించిందని శ్రావణి అన్నారు. పక్క రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది ఎన్నారైలు తనకు నైతికంగా మద్దతు ఇచ్చారని, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్సీ కవితక్క ఆహ్వానం మేరకు తాము బిఆర్ఎస్ పార్టీలో చేరామని, కెసిఆర్, కేటీఆర్‌ల ఆశీర్వాదంతో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహించామని శ్రావణి తెలిపారు. కష్టపడి పని చేసి ప్రజల అభిమానాన్ని, సంపాదించానని.. మూడేళ్ల పాటు జగిత్యాల పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని ఆమె వెల్లడించారు. పార్టీని నమ్ముకుని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని శ్రావణి తెలిపారు.

Also Read: జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే వేధింపులే కారణమని కన్నీటిపర్యంతం..

పార్టీ ఆదేశాల మేరకు పలు ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించామని ఆమె గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన తన భర్త కరోనాతో ఆసుపత్రి పాలయ్యారని శ్రావణి వెల్లడించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే స్వార్థపూరిత కుట్రకు ఒక బీసీ బిడ్డ, బహుజన మహిళ బలైపోయిందని ఆమె ఆరోపించారు. పదవుల కన్నా ఆత్మాభిమానమే ముఖ్యమని భావించి తాను మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశానే తప్ప, పార్టీకి రాజీనామా చేయలేదన్నారు. అయితే తాను నమ్మిన పార్టీ నుండి తనకు ఎలాంటి ఓదార్పు గాని, భరోసాగాని లభించలేదనే ఆవేదనతో తాను బాధాతప్త హృదయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని శ్రావణి తెలిపారు. తాను బీఫామ్ ఇవ్వడం వల్లే మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యిందంటూ ఎమ్మెల్యే మాట్లాడడాన్ని భోగ శ్రావణి తప్పు పట్టారు. పార్టీ ద్వారా సంక్రమించిన 37 వ వార్డు కౌన్సిలర్ పదవి తోపాటు బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

తాను ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యానని శ్రావణి తెలిపారు. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే వారిని, పార్టీలో ఉన్న కవితక్క మనుషులను కుట్రపూరితంగా దూరం చేయాలని అనుకుంటున్న ఎమ్మెల్యే విజయం సాధించారని శ్రావణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితక్కలపై తనకు అభిమానం ఎప్పటికీ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కౌన్సిలర్ పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేయడం పట్ల 37 వ వార్డు ప్రజలు తనను క్షమించాలని.. ఎప్పటికి ప్రజల వెంటే తాను ఉంటానని ప్రజా సమస్యల కోసం ముందుండి పోరాడతానని భోగ శ్రావణి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఓటమికి కి మొదటి కారణం తానే అవుతానని ఆమె సవాల్ చేశారు. 

మరోవైపు చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఎమ్మెల్యే అనుచరుల నుండి తనకు బెదిరింపు కాల్స్ మెసేజ్ లు వస్తున్నాయని శ్రావణి ఆరోపించారు. తన మద్దతుదారులను కూడా బెదిరిస్తున్నారని , తనను తన కుటుంబాన్ని అవమానపరిచే విధంగా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వల్ల వేధింపులకు గురైంది తాను మాత్రమే కాదని తనతో పాటు ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు వేధింపులకు గురవుతూ పార్టీలోనే ఉన్నారని శ్రావణి సంచలన వ్యాఖ్యలు చేశారు.