పంచాయతీ ఎన్నికలు.. ప్రత్యర్థి ఓటమికి తాంత్రికపూజలు
ఈ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి ఓడిపోవాలంటూ,.. అతని ఇంటి ముందు తాంత్రిక పూజలు నిర్వహించారు
పంచాయితీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఈ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. కాగా.. ఈ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి ఓడిపోవాలంటూ,.. అతని ఇంటి ముందు తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ వింత సంఘటన ఆలేరు మండలంలోని రఘునాథపురం గ్రామంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన బింగి నాగేష్ పంచాయితీ ఎన్నికల్లో నాలుగో వార్డు మొంబర్ గా పోటీచేస్తున్నాడు. కాగా.. గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం ముగించుకొని వచ్చాడు. శుక్రవారం ఉదయం నిద్రలేచి చూసేసరికి.. అతని ఇంటి ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి.
అతని ఇంటి ముందు పసుపు, నిమ్మకాయ, కుంకుమ, వేపకొమ్మలు, కోడిగుడ్లతో పూజలు చేసినట్లు కనిపించాయి. దీంతో నాగేష్ సహా.. అతని కుటుంబసభ్యులంతా భయాందోళనలకు గురౌతున్నారు. ఈ విషయం ఇప్పుడు గ్రామంతోపాటు.. చుట్టుపక్కల గ్రామాలలో దావాలంగా వ్యాపించింది. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.