జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కన్పించలేదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చేసిన ప్రచారానికి ఓటర్లు మొగ్గు చూపినట్టుగా తేలింది.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం కన్పించలేదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చేసిన ప్రచారానికి ఓటర్లు మొగ్గు చూపినట్టుగా తేలింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు డివిజన్లను కాంగ్రెస్ గెలుపొందింది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడ దక్కలేదు.ఈ స్థానంలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ స్థానంలో బీజేపీ అనుహ్యంగా విజయం సాధించింది.
ఇదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీలను వేసింది. ఈ కమిటీల ఏర్పాటుపై హైద్రాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది.
దీంతో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రం గౌడ్ బీజేపీలో చేరాడు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును తమ వైపునకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు, అంతర్గత కలహాలు కూడా ఆ పార్టీ కొంపముంచాయి.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే నెలకొన్నట్టుగా కన్పించింది. ఎన్నికల ఫలితాలు కూడ అదే రకంగా ఉన్నాయి. టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ భరోసాను కల్పించలేకపోయింది.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీఆర్ఎస్ లో చేరారు. ఇది కూడా కాంగ్రెస్ కు నష్టం కల్గించింది. కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపిస్తే టీఆర్ఎస్ లో చేరుతారని ప్రత్యర్ధులు చేసిన ప్రచారం కూడ తమకు నష్టం చేసిందనే అభిప్రాయాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తన ఓటింగ్ ను నిలుపుకోలేకపోయింది.. ఈ ఓటింగ్ బీజేపీ వైపునకు మళ్లిందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నగరంలో పూర్తిస్థాయి పట్టును సాధించలేదు. ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకొంది.
ఉద్యోగుల్లో టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని పోస్టల్ బ్యాలెట్ ద్వారా తేలింది. పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటీ బీజేపీ వైపునకే ఓటర్లు మొగ్గు చూపారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటింగ్ ను తమ వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. అదే సమయంలో ఎంఐఎంను బూచిగా చూపి చేసిన ప్రచారంతో కూడా ఆ పార్టీ ఓ వర్గం ఓట్లను సమీకరించుకోవడంలో సక్సెస్ అయింది.
also read:జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహపడొద్దు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మాత్రం సంప్రదాయకంగా తమ వెంట ఉన్న ఓటింగ్ ను కూడ దూరం చేసుకొంది. దీంతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి దిగజారింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 2 స్థానాలకే పరిమితమైంది. ప్రస్తతం ఆ పార్టీ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.
వరుస ఓటములు ఆ పార్టీని నిరుత్సాహపరుస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే నాయకత్వాన్ని మార్చాలనే డిమాండ్ కొందరు నేతలు తెరమీదికి తెస్తున్నారు.
