Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 2023: బీజేపీ దూకుడు, ఆ రెండు పార్టీలకు చెక్‌ పెట్టేనా?

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం దూకుడును పెంచింది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. 

BJP plans to get Power in Telangana in 2023
Author
Hyderabad, First Published Jan 5, 2022, 10:57 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో Bjp మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయం తీసుకొంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతుంది.  ఈ దిశగానే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.2023లో Telangana రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దుబ్బాక, Huzurabad అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు ఆ పార్టీలో మరింత ఉత్సాహన్ని నింపాయి. 

also read:టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యం.. పోరాటం మరింత ఉద్ధృతం : హైదరాబాద్‌లో జేపీ నడ్డా

2023 ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా అనుకూలంగా ఉందని కమలదళం భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో క్యాడర్ ను కూడా ఆ పార్టీ సన్నద్దం చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో కేంద్ర హోంశాఖ మంత్రి Amit shah షాతో  బీజేపీకి చెందిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అధికారంలోకి వచ్చేందుకు అనలంభించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు.

గత ఏడాది హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్ర సమయంలో అమిత్ షా టీమ్ రాష్ట్రంలో పర్యటించి  రాజకీయ పరిస్థితులపై కేంద్ర మంత్రికి నివేదికను అందించింది. ఆ తర్వాత కూడా అమిత్ షా టీమ్ మరోసారి  కూడా రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను అంచనా వేసి అమిత్ షా కు నివేదిక ఇచ్చింది.

2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీల్లోని కీలక నేతలను కూడా తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలను చేస్తోంది.  తెలంగాణలో మూడు రోజుల పాటు Rss  సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిల్లో పరిస్థితులపై చర్చించి రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టీఆర్ఎస్‌లో అసంతృప్త నేతలతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన  వారిని కూడా  కమల దళం తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ విషయమై పార్టీ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా దూకుడుగా విమర్శలు చేస్తోంది. వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ తీరును బీజేపీ ఎండగట్టింది.  అయితే కేంద్ర ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో రైతుల నుంది ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని టీఆర్ఎస్ నేతలు చెప్పే ప్రయత్నం చేశారు.Paddy  కొనుగోలు అంశంపై రాజకీయంగా మైలేజీ కోసం రెండు పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు..

కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పినందున యాసంగిలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.  మరో వైపు 317 జీవోపై రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనతో ఉన్నారు. ఈ జీవోతో సుమారు 25 వేల మంది ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.ఈ జీవోను రద్దు చేయాలని కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవోను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళనలకు దిగారు. 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  జాగరణ దీక్షకు దిగాడు. అయితే ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.  బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.  కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ కు తరలించారు.బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు  పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. హైద్రాబాద్ లో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP Nadda పాల్గొన్నారు.

అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో రాజకీయంగా తమను దెబ్బతీసేందుకు ఈ రెండు పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్  అంటూ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే తమ పార్టీయే  టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం కల్పిస్తే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని కమల దళం భావిస్తోంది. ఈ దిశగానే ఆ పార్టీ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.  గతంలో కంటే మరింత దూకుడా వెళ్లాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. బీజేపీ దూకుడుతో రాజకీయంగా తమకు నష్టమని కూడా కాంగ్రెస్ భావిస్తోంది.  ఇదే విషయమై ఆ  రాష్ట్ర నాయకత్వం మేల్కోంది. టీఆర్ఎస్, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios