బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలోని 5 జిల్లా పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించాల్సి వుంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణల్లోని జిల్లా పార్టీ ఆఫీసులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాగా.. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీకి అత్యంత అవకాశాలు వున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి తోడు దుబ్బాక, హుజురాబాద్ , జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఇటీవల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాషాయం రెపరెపలాడింది. దీంతో తెలంగాణలో జాగ్రత్తగా పావులు కదుపుతోంది.

దీనిలో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణకు క్యూకట్టనున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు రావాల్సి వుంది. షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రంలోని 5 జిల్లా పార్టీ కార్యాలయాలను ఆయన ప్రారంభించాల్సి వుంది. తొలుత సంగారెడ్డికి చేరుకుని పార్టీ నేతలతో భేటీ అనంతరం.. ఆ తర్వాత మరో ఆరు జిల్లా కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించాల్సి వుంది. అయితే అనివార్య కారణాలతో నడ్డా పర్యటన రద్దయ్యింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.