Asianet News TeluguAsianet News Telugu

సంజయ్ మీద కేసు, మజ్లీస్ నేతలను వదిలేశారు: కేసీఆర్ పై రాజా సింగ్

సాధారణ ప్రజలు లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ లు నమోదు చేసే పోలీసులు... లాక్ డౌన్ ను ఉల్లంఘించిన ఎంఐఎం  ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై  ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. 

BJP MLA Raja Singh Demands Action Against AIMIM MLA For Lockdown Violation
Author
Hyderabad, First Published May 16, 2020, 8:36 AM IST

సాధారణ ప్రజలు లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ లు నమోదు చేసే పోలీసులు... లాక్ డౌన్ ను ఉల్లంఘించిన ఎంఐఎం  ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై  ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. 

తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజమ్ మీటింగ్ నిర్వహించాడని అతనిపై  ఎఫ్ఐఆర్ నమోదు చేసారు కానీ ఈ లాక్ డౌన్ ఉల్లంఘన మీకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. 

ఒకవైపు ఈ కరోనా వైరస్ ని ఓడించడానికి అందరూ యుద్ధం చేస్తుంటే... ఈ ఎంఐఎం నాయకులు మాత్రం లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని రాజా సింగ్ అన్నారు. ఇదంతా ఏదో ఏ ఒక్క ఎంఐఎం నాయకుడికో పరిమితం అవ్వలేదని, అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారని, అసదుద్దీన్ ఒవైసి వీరి వెనుక ఉంది ఇదంతా చేపిస్తున్నారని అన్నారు రాజా సింగ్. 

ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే...  పాతబస్తీ, డబీర్ పుర ఫ్లైఓవర్ ని ఈ లాక్ డౌన్ నేపథ్యంలో మూసేసారు. ఇదొక్కటే ఫ్లై ఓవర్ కాదు, నగరంలోని అనేక ఫ్లైఓవర్లను కూడా ఈ కరోనా లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు మూసేసారు. 

నిన్న డబీర్ పురా ఫ్లై ఓవర్ వద్ద ఎంఐఎం పార్టీకి చెందిన మలక్ పేట్ ఎమ్మెల్యే బలాల లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తూ.... మూసి ఉన్న ఫ్లైఓవర్ ను తెరిచారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను తన అనుచరులతో కలిసి తొలిగించారు. అక్కడనుంచి వెళుతున్న ఇతర వాహనదారులను కూడా ఆ ఫ్లై ఓవర్ పై వెళ్లేందుకు అనుమతులిచ్చారు. 

ఫ్లైఓవర్ అవతలి వైపు మూసి ఉందని తెలుసుకొని అటువైపు కూడా వెళ్లి తెరిపించాడు. ఈ తతంగం అంతా నడుస్తుండగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ భయంతో తన ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ నిశ్చేడిగా ఉండిపోయాడు. 

ఇలా లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడడంపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీసుల పనితీరును కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీడియో సాక్ష్యం దొరికినా కేసు ఎందుకు నమోదు చేయలేదని సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు సామాన్యులు.  

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లు...  ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో ఆక్టివ్ కేసులున్నాయని నిన్ననే కేసీఆర్ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios