తెలంగాణ శాసనసభలో కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు-ప్రభావాలపై చర్చ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ సవరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనలేదని చెప్పారు.
విద్యుత్ సవరణ చట్టంపై అసెంబ్లీ మరోసారి చర్చ అవసరం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ శాసనసభలో కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు-ప్రభావాలపై చర్చ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని విద్యుత్ సవరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సబ్సిడీలు ఇవ్వొచ్చని బిల్లులో కేంద్రం పేర్కొందని చెప్పారు. 2020, 2022లలో తీసుకొచ్చిన రెండు విద్యుత్ సవరణ బిల్లుల్లో కూడా.. వ్యవసాయానికి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పలేదని చెప్పారు.
ఇక, అంతకు ముందు సభలో ఈ అంశంపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చర్చను ప్రారంభించారు. కేంద్రం ప్రజల సమస్యలను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదని అన్నారు. కొందరు పారిశ్రామికవేత్తల లబ్ది కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో అద్భుత ప్రగతి సాధించామని తెలిపారు.
Also Read: కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఏడు బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం..
ఇదే అంశంపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. దేశాన్ని బీజేపీ అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. మీటర్లు పెట్టే విధానాన్ని అందరూ వ్యతిరేకించాలని అన్నారు. కేంద్ర విద్యుత్ చట్టంతో పాటు ఇతర అంశాలపైనా సభలో చర్చించాలన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. విద్యుత్ సవరణ చట్టంపై చర్చ ముఖ్యమేనని తెలిపారు. విద్యార్థులు, పోలీసు రిక్రూట్మెంట్ ప్రక్రియపై కూడా చర్చ చేద్దామని కోరారు. ప్రజల సమస్యలపై చర్చకు వేరే వేదిక లేదని అన్నారు.
