తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్‌. వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను తాను చూడలేదని రాజేందర్ స్పష్టం చేశారు.  

తెలంగాణలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈటల స్పందించారు. తనకు వాట్సాప్ వాడటం రాదని.. ఫోన్లు వస్తే మాట్లాడటం తప్పించి మిగతావి తెలియదన్నారు. వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను తాను చూడలేదని రాజేందర్ స్పష్టం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇకపోతే ఈటలను రేపు ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ ఆఫీసులో హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లీగల్ ఓపీనియన్ అనంతరం విచారణకు హాజరవ్వాలా లేదా అన్న దానిపై ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకోనున్నారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చిన పోలీసులు.. సాక్షిగా విచారణకు రావాలని కోరారు. 

ఇక, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. మంగళవారం రాత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను బుధవారం బొమ్మలరామారం నుంచి వరంగల్‌కు తరలించారు. ఆయనను బుధవారం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంజయ్‌ను నిన్న రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక, ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయనపై ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. 

ఈ క్రమంలోనే బండి సంజయ్‌ను కలిసేందుకు ఆయన భార్య అపర్ణ.. ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా, అధికారులు అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న బండి సంజయ్‌ను అపర్ణ కలిశారు. సంజయ్‌తో ములాఖత్‌ అనంతరం బయటకు వచ్చిన అపర్ణ మీడియాతో మాట్లాడారు. అరెస్ట్ అయినప్పటి నుంచి తనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి బండి సంజయ్ ధన్యవాదాలు చెప్పారని తెలిపారు. 

Also Read: టెన్త్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ఈటల రాజేందర్‌కు నోటీసులు

‘‘రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దాకా ఇలాంటి పోరాటమే చేయాలని చెప్పారు. సంజయ్‌కు ఉన్న బాధల్లా ఒక్కటే.. ప్రధాని నరేంద్ర మోదీ 8న హైదరాబాద్‌కు వస్తున్నారని.. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలను కోరారు. ఆయన 30 లక్షల మంది యువత కోసం కష్టపడుతుంటే ఆయననను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి జైలులో ఉంచి.. ఇష్యూను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఫైట్ ముందు కూడా చేస్తానని.. భయపడటం లేదని, ఇంతకంటే పెద్ద కేసు అయినా భరించుకుంటానని చెప్పమని అన్నారు. ప్రతి కార్యకర్తకు బీజేపీ నాయకత్వం ఉంటుందని కూడా చెప్పమని తెలిపారు. సంజయ్‌ను అరెస్ట్ చేసిన తీరు చాలా బాధకరం. పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. 

పొలిటిక్స్ ఇంటి బయట ఉండాలి.. ఇంట్లోకి రాకూడదని సంజయ్ చెబుతారు. మేము భయపడతామని కాదు.. పిల్లల దాకా రాకూడదనేది ఆయన అభిప్రాయం. బలగం చూపించిన వాళ్లకు ఏమోషన్స్ డెవలప్ అయ్యేవేమో అని కూడా సంజయ్ అన్నారు. ఆయన బెయిల్ గురించి బీజేపీ లీగల్ సెల్ చూసుకుంటుంది. బెయిల్ వచ్చినా, కస్టడీ వచ్చినా భయపడేది లేదని చెప్పారు. దేనికైనా తెగించే ఉన్నానని తెలిపారు’’ అని అపర్ణ చెప్పారు.