సోనియా గాంధీ పై ఎంతో అభిమానం, గౌరవం వుంది..: విజయశాంతి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంటే ఎంతో అభిమానం, గౌరవం వుందంటూ తెలంగాణ బిజెపి నాయకురాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు మాటల యుద్దం ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై ఘాటు విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంటే తనకెంతో అభిమానం అని... ఆమెను గౌరవిస్తామంటూ బిజెపి నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగంపై విజయశాంతి ట్విట్టర్ వేదికన రియాక్ట్ అయ్యారు. ''ఎంఐఎం, బీఆర్ఎస్ ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం. అయితే మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని విషయం కూడా'' అన్నారు విజయశాంతి.
''దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తున్నదా? కాంగ్రెస్ ఓడిపోతున్నదా? ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా? ఒక్క మాటలో, దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చెయ్యగలుగుతున్నదా?'' అంటూ అనుమానాలు వ్యక్తం చేసారు.
Read More తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నా కల: సోనియా గాంధీ
''ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారిని ఈ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం... రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం'' అంటూ విజయశాంతి ఎక్స్(ట్విట్టర్) వేదికన స్పందించారు.