ఫిర్యాదు కోసం ఎదురు చూస్తారా..? విజయ శాంతి ఫైర్
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో హోం మంత్రి మహమూద్ అలీ చేసిన పొరపాటుపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు
బీజేపీ మహిళా నేత విజయశాంతి మరోసారి.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో హోం మంత్రి మహమూద్ అలీ చేసిన పొరపాటుపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం పై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భైంసాలో జరిగిన హింస కాండపై సైతం ఆమె స్పందించారు.
ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో.. విమర్శలు గుప్పించారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో ఏమన్నారంటే...
"ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ గారు తాను ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశాననేది బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల నియమావళిని కాలరాసిన హోంమంత్రి ఓటు చెల్లదు. కానీ, ఆయనపై నిన్న ఎవరూ ఫిర్యాదు చెయ్యలేదని.... ఆర్వో ఫిర్యాదు అందిన వెంటనే ఓటుపై పరిశీలిస్తామని అధికారులు అన్నారు. హోంమంత్రి ఎవరికి ఓటేశారో స్వయంగా ఆయనే నిబంధనలకు విరుద్ధంగా మీడియా వద్ద బహిరంగంగా చెప్పిన తర్వాత... వెంటనే చర్య తీసుకోకుండా ఫిర్యాదు కోసం ఎదురు చూడటం ఏంటో అర్థం కావడం లేదు.’’ అని ఆమె అన్నారు.
‘‘లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేల ఎన్నికలకు వ్యయపరిమితిని విధించిన ఎన్నికల సంఘం... ఎమ్మెల్సీల విషయంలో అలాంటిదేమీ పెట్టకపోవడంతో టీఆరెస్ పార్టీ విచ్చల విడిగా కోట్లాది రూపాయల ధనాన్ని ప్రకటనలు, ప్రచారం కోసం... ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఖర్చు చేసింది. రాజ్యాంగ వ్యవస్థలంటే తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రివర్యులకు ఏ మాత్రం పట్టదు. పాలనను గాలికొదిలేసిన సర్కారు ఇది. పదే పదే హింసకు గురవుతున్న భైంసా పట్టణమే ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. పలుమార్లు శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారి, లూటీలు, దాడులు, హత్యలు యథేచ్ఛగా జరుగుతూ భైంసా ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతుంటే.... రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేలు వాయించిన నీరోను గుర్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్ గారు’’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.