కేసీఆర్ పాలనపై ‘సాలు దొర.. సెలవు దొర’ వెబ్సైట్ : బీజేపీ నేత తరుణ్ చుగ్
కేసీఆర్ పాలనపై ‘సాలు దొర.. సెలవు దొర’ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నామని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్చుగ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికలకు తాము పూర్తి సంసిద్ధంగా ఉన్నట్టు తరుణ్ చుగ్ చెప్పారు
సీఎం కేసీఆర్పై (kcr) మండిపడ్డారు తెలంగాణ బీజేపీ (bjp) వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ (tarunchug). శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబం మొత్తం పెత్తనం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించినా, కేసీఆర్ ప్రభుత్వం కుంభకర్ణుడి నిద్రలో ఉందని తరున్ చుగ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అలీబాబా 40 దొంగల తీరుగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Also Read:నెరవేర్చని హామీలపై చర్చకు మేం సిద్దం:కేసీఆర్కి తరుణ్ చుగ్ సవాల్
టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని తరుణ్ జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనపై ‘సాలు దొర.. సెలవు దొర’ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నామని తరుణ్చుగ్ వెల్లడించారు. కేసీఆర్ గద్దె దిగు... బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందని నిత్యం గుర్తు చేస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు పూర్తి సంసిద్ధంగా ఉన్నట్టు తరుణ్ చుగ్ చెప్పారు. ప్రతి ఇంటికి బండి సంజయ్ (bandi sanjay) చేపట్టే ప్రజా సంగ్రామ యాత్ర వెళ్తుందని... జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ ఉంటుందని తరుణ్చుగ్ పేర్కొన్నారు.